బాబు సూచన మేరకు శ్రీవారి ఆలయాలు: చదలవాడ కృష్ణమూర్తి
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన వేరకు విజయవాడ, రాజమండ్రిల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. మంగళవారం జరిగిన టిటిడి పాలక మండలి సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలోని భద్రాచలం క్షేత్రంలాగానే కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. టిటిడిలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం తిరుమలలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చదలవాడ చెప్పారు.
పాలక మండలి సమావేశంలో టిటిడి పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పేరూరులో వకుళమాత ఆలయాన్ని పునర్నిర్మిస్తామని కమిటీ తెలియజేసింది. ఒంటిమిట్ట రామాలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు, భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది.
టిటిడి వినియోగించే సోనామసూరి బియ్యాన్ని రూ. 35కు కొనుగోలు, టిటిడి ఉద్యోగుల యాత్రికుల పరిహార భత్యాన్ని 1500 నుంచి 2500కు పెంపు, సురాపురం తోట గదుల అద్దెను 750 నుంచి 1500 పెంపు, గోవిందరాజుల ఆలయం అభివృద్ధికి రూ. 59లక్షల కేటాయింపు నిర్ణయాలకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది.
కాగా, రూ. 72 కోట్లతో నూతనంగా వసతి సముదాయాలు ఏర్పాటు, 50 కోట్లతో కొనుగోళ్లకు ఆమోదం, రూ. 10 కోట్లతో తిరుపతిలోని 2వ, 3వ సత్రాల ఆధునీకరణ వంటి కీలకమైన వాటికి పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.