తాత్కాలిక సచివాలయం: 2 సంస్థలు బిడ్లు, తాత్కాలిక రాజధాని నిర్మాణంలో మార్పు
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం కోసం సిఆర్డీఏ బిడ్లు తెరిచింది. ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు బుధవారం నాడు బిడ్లు దాఖలు చేశాయి. ఈ నెల పదో తేదిన ఫైనాన్షియల్ బిడ్లను తెరుస్తారు. అదే తేదీన టెండర్లు ఖరారు చేసి సీఆర్డీఏ ఒప్పందం చేసుకోనుంది.
రూ.180 కోట్లతో రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించింది. మూడు బ్లాకులుగా తాత్కాలిక సచివాలయ భవనం నిర్మించనున్నారు.
టెండరు ఖరారయ్యాక చెప్పిన గడువు కంటే ముందే తాత్కాలిక సచివాలయాన్ని పూర్తి చేయడం పై కూడా సీఆర్డీఏ దృష్టి సారించింది. మరోవైపు, తాత్కాలిక రాజధాని నిర్మాణంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అమరావతి టౌన్ షిప్ బదులు వెలగపూడి, మల్కాపురం పరిధిలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు మంగళగిరిలో అమరావతి టౌన్ షిప్లో భవనం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.