ఎలుకలు.. బల్లుల పేరు చెప్పి లక్షలు తినేశారా..? ఏపీలో వెలుగుచూసిన మరో భారీ స్కాం..!?
అనంతపురం : సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి. అదే స్పూర్తిగా తీసుకున్నారేమో అనంతపురం అధికారులు... బల్లులు, ఎలుకలు అనే తేడా లేకుండా పెస్ట్ కంట్రోల్ పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. లక్షల రూపాయలు జేబులో వేసుకున్నారు. ఒక్క అనంతపురం జిల్లా ఆస్పత్రిలోనే లక్షల రూపాయల మేర గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
బల్లికి రూ.3వేలు, ఎలుకకు రూ. 10వేలు
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెస్ట్ కంట్రోల్ పేరుతో ఎలుకలు పట్టే పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో కాంట్రాక్టు సొమ్మును భారీగా పెంచేసి, ఆ పనిని కొంతమంది టీడీపీ నేతల అనుచరులకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా ఆస్పత్రిలో చిత్తూరు జిల్లాకు చెందిన పద్మావతి పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. బల్లులు, ఎలుకలు పట్టుకున్నందుకు భారీ మొత్తంలో నగదు అందుకున్నారు బల్లిని పట్టుకుంటే రూ.3 వేలు, ఎలుకను పట్టుకుంటే ఏకంగా రూ.10వేలు ముట్టబెప్పారు. ఇలా నాలుగేళ్ల కాలంలో ఏకంగా రూ.45లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.
కాంట్రాక్ట్ పొడిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ కింద హాస్పిటల్లో ఆరుగురు పనిచేయాల్సి ఉండగా.. ఇద్దరు, ముగ్గురు మాత్రమే విధుల్లో కనిపిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. హాస్పిటల్లో లేని ఎలుకలు, బల్లులు పట్టినట్లు కాగితాల్లో చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. గత నాలుగేళ్లలో 1,429 ఎలుకలు, 230 బల్లులు పట్టుకున్నట్లు చూపిన కాంట్రాక్టర్ రూ. 45లక్షలు జేబులో వేసుకున్నారు. ఇదిలా ఉంటే కాంట్రాక్టు గడువు సమయం ముగిసినా బంగారు బాతును వదులుకునేందుకు ఇష్టపడని కాంట్రాక్టర్ ఒప్పందాన్ని మరో రెండేళ్లు పొడగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
బల్లులు, ఎలుకలు లేకున్నా పెస్ట్ కంట్రోల్
నిజానికి చాలా జిల్లాల్లోని హాస్పిటల్లలో ఎలుకలు, బల్లులు లేవు. అయినా ఉన్నట్లుగా చూపించి కాంట్రాక్టులు దక్కించుకున్నారు. కాంట్రాక్టులో భాగంగా పట్టని ఎలుకలు, బల్లుల్ని లెక్కల్లో చూపింది నెల నెలా బిల్లులు డ్రా చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఏపీ ఆరోగ్య శాఖ తీసుకుంటున్న నిర్ణయంపై ఎప్పటి నుంచో వివాదాలు నెలకొన్నాయి. గత ప్రభుత్వంలోని ముఖ్యులకు సంబంధించిన వారికి కాంట్రాక్టులు అప్పగించి ఎలుకలు ఉన్నా లేకున్నా 8.4కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. గతేడాది గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికి శిశువు మృతి చెందిన నేపత్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ాటి నివారణ కోసం పెస్ట్ కంట్రోల్ ప్రోగ్రాం చేపట్టారు. అప్పటి నుంచి ప్రజాధనం దర్వినియోగం అవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పట్లో జీహెచ్ఎంసీ
ఏపీలో పెస్ట్ కంట్రోల్ పరిస్థితి తలపించేలా గతంలో జీహెచ్ఎంసీ అధికారులు లక్షలకు లక్షలు పక్కదారి పట్టించారు. కలుగుల్లో ఉండే ఎలుకల పేరు చెప్పి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు లక్షలకు లక్షలు కాజేశారు. లిబర్టీ చౌరస్తాలోని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఎలుకల బెడద నివారించేందుకు అక్షరాలా రూ.2,40,000లు కాంట్రాక్టర్కు చెల్లించారు. అయితే డబ్బు తీసుకున్న కాంట్రాక్టరు ఎలుకల నివారణకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.