టెండర్ల వివాదం: ఎంపీ సీఎం రమేష్ ఆఫీసుపై టీడీపీ నేతల దాడి, ఫర్నిచర్ ధ్వంసం
కడప: ఎంపీ సీఎం రమేష్కు చెందిన రుత్విక్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయంపై సోమవారం రాత్రి దాడి జరిగింది. సోమవారం జరగాల్సిన గండికోట పునరావాస టెండర్లలో నెలకొన్న వివాదం చివరికి ఈ ఘటనకు దారితీసింది. టెండర్లను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... గండికోట పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 25 కోట్ల వ్యయంతో ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఇందులో కొర్రపాడు గ్రామ పునరావాసానికి సంబంధించి రూ. 8.14 కోట్లు, నేదరపేట గ్రామానికి సంబంధించి రూ. 5.20 కోట్లు, ముచ్చుమర్రి పునరావాసానికి సంబంధించి రూ. 5.44 కోట్లు, సుగుమంచిపల్లె గ్రామానికి సంబంధించి రూ. 5.65 కోట్లు విలువైన టెండర్లున్నాయి. ఈ టెండర్లకు సంబంధించి ఆన్లైన్లో బిడ్లను దాఖలు చేసేందుకు సోమవారమే ఆఖరు తేది.
మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన స్థానిక టీడీపీ నాయకులు ఈ టెండర్లు తమకే ఇవ్వాలంటూ తమ నేతలపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఈ పునరావాస పనులను ఎంపీ సీఎం రమేష్కు చెందిన రుత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు స్థానిక ఆర్ అండ్ బి బంగ్లలో సమావేశమై ఈసారి ఈ పనులు రుత్విక్ కన్స్ట్రక్షన్స్కు ఇవ్వరాదని నిర్ణయించారు.
సోమవారం మధ్యాహ్నం సమయంలో టెండర్లు నిలిపివేస్తున్నట్లు నీటిపారుదల కార్యాలయం నుంచి వీరికి సమాచారం అందింది. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాము కూడా టెండర్లు వేస్తున్నామనే అక్కసుతో రుత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీయే టెండర్లు ఆపివేయించిందని భావించి ఆ కంపెనీపై దాడికి దిగారు.
మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గాలకు చెందిన 50 మంది నాయకులు స్థానిక రుత్విక్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడున్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమకు టెండర్లు దక్కకుండా చేయించేందుకే రుత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్లను నిలిపివేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి పనీ కంపెనీయే చేజిక్కించుకుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈనెల 22న టెండర్లు ఓపెన్ చేసే తేదీ కాగా, ఆ తేదీ వరకు తాము పనులు జరగనివ్వమని ఇరువర్గాలకు చెందిన స్థానిక నాయకులు స్పష్టం చేశారు.