ఏపీలో రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి టెండర్లకు ఆహ్వానం: రాష్ట్ర రోడ్లపై టోల్ బాదుడుకు జగన్ సర్కార్ శ్రీకారం
ఏపీ సర్కార్ రాష్ట్ర ప్రధాన రహదారులపై దృష్టి సారించిందా ? ఇదే సమయంలో టోల్ బాదుడుకు కూడా రంగం సిద్ధం చేస్తోందా ? రాష్ట్ర ఖజానా లోటును టోల్ పన్నులతో భర్తీ చేయడానికి సిద్ధమవుతోందా ? రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ ఏపీ సర్కార్ ప్రధాన రహదారులపై దృష్టి సారించడం వెనుక మతలబు అదేనా అంటే అవును అనే సమాధానమే వస్తుంది.
రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన రహదారుల అభివృద్ధి పై దృష్టి సారించింది. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులను ఆపకుండా కొనసాగించాలని భావిస్తున్న ఏపీ సర్కార్ మేరకు రాష్ట్రంలో రోడ్ల ను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదటి పది రోడ్లను ఎంపిక చేసి వాటి అభివృద్ధికి టెండర్లు పిలిచింది. ఈ నెల 18వ తేదీ వరకు దాఖలు చేయొచ్చని రోడ్లు మరియు భవనాల శాఖ టెండర్ నోటిఫికేషన్ లో పేర్కొంది.
టోల్ బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14,722 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు ఉన్నాయి. డబల్ రోడ్డు, ఫోర్ వే మార్గాలలో ఉన్న పెద్ద రహదారులను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఏపీ స్టేట్ టోల్ పాలసీ ప్రకారం ఈ రహదారులపై పన్ను కూడా వసూలు చేయాలని నిర్ణయించింది. ఏపీ టోల్ పాలసీ ప్రకారం ఇప్పటికే 35 రహదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం వాటిలో 10 రహదారులను టోల్ పాలసీ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది.
10 రోడ్ల అభివృద్ధి పనులకు టెండర్లకు ఆహ్వానం
ప్రకాశం జిల్లాలో మూడు రహదారులు, గుంటూరులో 2 రహదారులు, పశ్చిమ గోదావరిలో 2, వైఎస్ఆర్ కడప జిల్లా, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఒక్కొక్క రహదారి చొప్పున ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండర్లను పిలవడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకు బిడ్లను స్వీకరిస్తారు. రహదారులు అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో టోల్ పాలసీ ప్రకారం నిర్ణయాలు తీసుకోనున్నారు. టెండర్లు పూర్తయిన వెంటనే ఒక్కొక్క రోడ్డు అభివృద్ధి పనులను రెండు, మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఖజానా లోటు భర్తీతో పాటు రోడ్ల అభివృద్ధి కూడా
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, నిర్వహణ, బదలాయింపు ప్రాతిపదికన నిర్మించిన రహదారులపై ఇప్పటికే టోల్ పన్నులు వసూలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎంపిక చేసిన మిగతా రోడ్లను కూడా అభివృద్ధి చేసి పనుల బాదుడుకు రంగం సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఖజానాను, వాహనదారులపై వేసే టోల్ పన్నుల ద్వారా కొంతమేర తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
ఆదాయం పెంచుకునే ప్లాన్ లో భాగమే రోడ్ టోల్ పన్నులు
ఏపీ స్టేట్ రోడ్ ఫీజు పేరిట రహదారి పన్నులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ స్టేట్ రోడ్ ఫీజు ద్వారా వచ్చిన ఆదాయాన్ని రహదారుల అభివృద్ధికి కేటాయిస్తామని చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వాన్ని నడపడానికి ఆదాయం పెంచుకునే ప్రతి అవకాశాన్ని అన్వేషిస్తోంది అని పలువురు ఏపీలో రాష్ట్ర రోడ్డు టోల్ ఫీజుల వసూళ్లపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.