సెలెక్ట్ కమిటీలపై తలోమాట.. చైర్మన్ నుంచి లేఖ రాలేదట.. మండలి బులిటెన్పై టెన్షన్
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. మూడ్రోజుల గ్యాప్ తర్వాత సోమవారం మండలి మొదలైన వెంటనే కమిటీల ప్రకటన ఉంటుందని, ఆ మేరకు ఏర్పాట్లు పూర్తిచేయాలంటూ చైర్మన్ షరీఫ్ ఆదివారమే అధికారులకు లేఖలు రాసిపంపారని వార్తలు ప్రసారమయ్యాయి. టీడీపీ నేతలు కూడా దీన్ని ఖరారు చేశారు. కానీ అసెంబ్లీ వర్గాలు మాత్రం దీన్ని ఖండించాయంటూ వైసీపీ శ్రేణులు కొత్త ప్రచారం మొదలుపెట్టాయి.
బులిటెన్ తర్వాతేనట..
మండలి చైర్మన్ షరీఫ్ పేరుతో ఎలాంటి లేఖలు అందలేదని, సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ లేఖలతో జరిగేదికాదని అసెంబ్లీ అధికాలు అన్నట్లు వైసీపీ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆదివారం సాయంత్రానికి కూడా కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలుకాలేదనిర, ముందుగా బులిటెన్ విడుదల చేసిన తర్వాతే ప్రక్రియ మొదలవుతుందని, దీనిపై టీడీపీ అనవసరంగా విషప్రచారంచేస్తోందని వైసీపీ నేతలు పేర్కొన్నారు.
ఏం జరగబోతోంది?
సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై రెండు పార్టీల వర్గాలు తలోమాట చెబుతుండటం, అసెంబ్లీ అధికారుల వాయిస్ గా మరికొన్ని అంశాలు వెలుగులోకి రావడంతో మొత్తం వ్యవహారం గందరగోళంగా మారింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం అసెంబ్లీలో మండలి రద్దుపై చర్చ కొనసాగనుండగా.. మండలి కార్యక్రమాలు ఏలా ఉంటాయనేదానిపై టెన్షన్ నెలకొంది.
సెలెక్ట్ కమిటీలకు మంత్రులే చైర్మన్లు
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై వేటికవే విడివిడిగా సెలెక్ట్ కమిటీలు ఏర్పాటవుతాయని, ఆయా బిల్లుల్ని మండలిలో ప్రవేశపెట్టిన మంత్రులే కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. వికేంద్రీకరణ బిల్లుపై కమిటీకి మంత్రి బుగ్గన, సీఆర్డీఏ రద్దు బిల్లుపై కమిటీకి మంత్రి బొత్స చైర్మన్లుగా ఉంటారని, ఒక్కో కమిటీలో గరిష్టంగా తొమ్మిది మంది సభ్యులుంటారని తెలుస్తోంది. మండలిలో టీడీపీదే మెజార్టీ కాబట్టి కమిటీలోని తొమ్మిది మందిలో ఐదుగురు టీడీపీ సభ్యులు, చైర్మన్ కాకుండా మరో ఇద్దరు వైసీపీ సభ్యులు, ఒక పీడీఎఫ్ లేదా బీజేపీ సభ్యుడిని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం.