కోటంరెడ్డితో మహిళా ఎమ్మెల్యేల ఢీ: స్పీకర్పై వైసిపి దౌర్జన్యం, మార్షల్స్తో కొట్టించారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, ప్రాంగణంలో శుక్రవారం నాడు హైటెన్షన్ వాతావరణం కనిపించింది. వైసిపి సభ్యులు సభలో స్పీకర్ పైన దాడికి ప్రయత్నం చేశారని టిడిపి సభ్యులు ఆరోపిస్తున్నారు. వాటిని వైసిపి సభ్యులు కొట్టి పారేస్తున్నారు. మరోవైపు, అడ్డుకున్న మార్షల్స్ను వైసిపి సభ్యులు కొట్టారని ఒకరు, మార్షల్స్తో తమను కొట్టించారని విపక్షం మండిపడుతోంది.
మీడియా పాయింట్ వద్ద..
సభలో గందరగోళం నెలకొనగా స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన వసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ మీడియా ప్రతినిధిలో మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటికే ఆయన వెనకకు చేరుకున్న టిడిపి ఎమ్మెల్యే యామినిబాల ఆయన మాట్లాడుతున్న సమయంలోనే తాను మాట్లాడే యత్నం చేశారు.
ఇలా ఒకేసారి మీడియాతో ఇద్దరు మాట్లాడటం సబబు కాదని కోటంరెడ్డి చెబుతున్నా... యామినిబాల తగ్గలేదు. దీంతో కోటంరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో టిడిపి చెందిన మరో మహిళా ఎమ్మెల్యే అనిత కూడా అక్కడకు వచ్చారు.
లైవ్-అసెంబ్లీ: లోటస్ పాండ్ రూల్స్ చెల్లవు, వైసిపి గందరగోళం, అడ్డుకున్న మార్షల్స్
కోటంరెడ్డికి ఓ వైపు యామినిబాల, మరోవైపు అనిత నిలబడ్డారు. కోటంరెడ్డి వ్యాఖ్యలను అక్కడికక్కడే ఖండించేందుకు వారిద్దరూ యత్నించారు. దీంతో కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేసిన కోటంరెడ్డి తీవ్ర స్వరంతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అనిత మాట్లాడుతుండగా వెళ్లిపోయారు.
దౌర్జన్యం
చేయలేదు:
కోటంరెడ్డి
సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. హోదాపై చర్చ అంటే టిడిపికి భయమెందుకని ప్రశ్నించారు. ప్రకటన కాదు చర్చ కావాలన్నారు. చర్చకు ముందుకు వస్తే సభ సజావుగా సాగుతుందన్నారు. స్పీకర్ పైన దౌర్జన్యం అని చెప్పడం సరికాదన్నారు.
ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు: చెవిరెడ్డి
చంద్రబాబు ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని చెవిరెడ్డి భాస్కర రెడ్డి ధ్వజమెత్తారు. జిమ్మిక్కు మాటలతో ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. స్పీకర్ అంటే మాకు గౌరవం ఉందన్నారు. నిరసన తెలపడానికే తాము స్పీకర్ వద్దకు వెళ్లామన్నారు. ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. హోదా వదిలి ప్యాకేజీకి ఓకే అంటున్నారన్నారు. నిరసన తెలుపుతుంటే మార్షల్స్ చేత కొట్టిస్తారా అన్నారు.
నిరసన తెలిపే అవకాశమివ్వట్లేదు: శివప్రసాద్ రెడ్డి
సభలో తమకు నిరసన తెలిపే అవకాశమివ్వడం లేదని వైసిపి ఎమ్మెల్యే శివప్రసాసాద్ రెడ్డి అన్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సభలో నోరు మూసుకోమని కూర్చోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల డిమండ్ మేరకే నిరసన చెబుతున్నామన్నారు. ఓట్లు వేసి గెలిపించింది ప్రజాభిప్రాయాన్ని తొక్కేయడానికే అని మండిపడ్డారు. హోదా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు.
బ్లాక్ డే, స్పీకర్ పైన దాడికి యత్నం: జయనాగేశ్వర రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పైన దాడికి ప్రయత్నించారని టిడిపి ఎమ్మెల్యే జయనగాగేశ్వర రెడ్డి ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ రాద్దాంతం చేస్తోందన్నారు. హామీల అమలుకు పోరాడుతున్నామన్నారు. స్పీకర్ పైన దాడికి ప్రయత్నం అమానుషమన్నారు.
దుష్ప్రచారం: అనిత
తాము హోదా వద్దంటున్నామని వైసిపి దుష్ప్రచారం చేస్తోందని టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. తమకు హోదా కావాలి, ప్యాకేజీ కావాలన్నారు. హోదా పైన చర్చకు ఓకే అని చెబుతున్నా వైసిపి సభ్యులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. సభను నడిపించవద్దనేది వైసిపి వ్యూహమన్నారు.