అసెంబ్లీ వద్ద హైడ్రామా: తాళం ధ్వంసం, గేటు ఎక్కిన ఎమ్మెల్యేలు, మెచ్చుకున్న జగన్!
హైదరాబాద్: అసెంబ్లీ వద్ద శుక్రవారం నాడు హైడ్రామా చోటు చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, శ్రీనివాసులు, ముస్తఫా తదితరులు అసెంబ్లీ గేటు వద్ద రాయితో తాళాలు పగులగొట్టి, గేటు దూకి... లోనికి వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
గేటు దూకి లోనికి వెళ్లిన ఎమ్మెల్యేలతో వైసిపి అధినేత వైయస్ జగన్ ముచ్చటించారు. వారిని అతను ప్రశంసించినట్లుగా కూడా తెలుస్తోంది.
ఉదయం శాసన సభలో అంబేడ్కర్ పైన చర్చకు వైసిపి ముందుకు రాకపోవడంతో వైసిపి ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. జగన్తో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ గేటు వద్ద ధర్నాకు దిగారు.
ఆ తర్వాత మధ్యాహ్నం కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు తాళం పగులగొట్టి, గేటు ఎక్కి అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయినా వారు వినిపించుకోకుండా గేటు దూకి లోపలకు వెళ్లారు.
అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్తున్న జగన్ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి ఉన్నప్పటికీ తనను ఎందుకు అడ్డుకుంటున్నా రంటూ జగన్ పోలీసులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు లోనికి వెళ్లారు.