ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యుల ధర్నా:సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
Recommended Video
అమరావతి:ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్స్ వారి కుటుంబ సభ్యులతో కలసి సీఎం చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేపట్టారు.
ఎస్పీఎఫ్ నుంచి 80 మందిని అకారణంగా సర్వీసుల నుంచి తొలగించారని, ఉద్యోగాలు కోల్పోవడంతో తమ కుటుంబాలు మూడేళ్లుగా రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామని వస్తే వస్తే అడ్డుకోవడం దారుణమని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కుటుంబాలు వాపోయారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్స్ కుటుంబాలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడనుంచి తరలించే ప్రయత్నం చేయడంతో సిఎం నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. తమని ఉద్యోగాల నుంచి తొలగించడం పట్ల ఎవరూ ప్రభుత్వాన్ని నిలదీయక పోవడం బాధ కలిగిస్తోందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా సర్వీసు నుంచి తొలగించిన కానిస్టేబుల్స్ లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పారు. అయినా వారి కుటుంబాలకు గడచిన మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయం అందలేదన్నారు. పైగా తమని ఆదుకోకపోగా అక్రమంగా అరెస్టులు కూడా చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎస్పీఎఫ్ అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి తన హయాంలో సుమారు 80 మంది సిబ్బందిని ఇలా ఉద్యోగాల నుంచి తీసేసారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తమ ఆందోళనపై ప్రభుత్వం దిగివచ్చి తిరిగి తమను ఉద్యోగాల్లోకి తీసుకునేవారకు పోరాడతామని, ఈ పోరాటంలో తాము ప్రాణలు పణంగా పెట్టడానికైనా సిద్దంగా ఉన్నామని ఆందోళన సందర్భంగా ఉద్యోగాల నుంచి తొలగించబడిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్స్ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా తమ తొలగింపుపై విచారణ జరిపించి అసలు వాస్తవాలు తెలుసుకోవాలని వీరు కోరుతున్నారు.