గుంటూరు జిన్నా టవర్ వద్ద ఉద్రిక్తత-జెండా ఎగరేసేందుకు హిందూవాహిని విఫలయత్నం
రిపబ్లిక్ డే సంబరాల వేళ గుంటూరు జిన్నా టవర్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జిన్నా టవర్ పైా జెండా ఎగరేసేందుకు హిందూవాహిని కార్యకర్తలు ఇవాళ విఫలయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగురవేస్తామని హిందూ వాహిని పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు జిన్నా టవర్ వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ రిపబ్లిక్ డే సందర్భఁగా జిన్నా టవర్ వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించిన హిందూ వాహిని సభ్యులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. వారిని స్ధానిక పీఎస్ కు తరలించారు. ప్రశాంతంగా ఉండే గుంటూరు నగరంలో హిందూవాహిని కార్యకర్తల చర్యతో ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.
రాష్ట్రంలో బీజేపీ నేతలు తాజాగా గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్ జాతిపిత పేరుతో ఉన్న జిన్నా టవర్ పేరు మార్చకుంటే తాము అధికారంలోకి వచ్చాక పేరు మారుస్తామని ఓసారి, ఈ టవర్ ను కూల్చేస్తామని మరోసారి హెచ్చరికలు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు స్ధానికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కార్పోరేషన్ సాయంతో టవర్ చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. పోలీసు భద్రతను కూడా పెంచారు. ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మరికొంత భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో హిందూవాహిని కార్యకర్తల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో స్ధానికంగా ఈ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది.