టిఆర్ఎస్Vsటిడిపి, కిందపడ్డ నన్నపనేని, తమిళ రభస
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంపిన ఎపి పునర్వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టారు. సీమాంధ్ర ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. దీంతో మండలిని చైర్మన్ మంగళవారానికి వాయిదా వేశారు. అనంతరం తెరాస, టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్సీలు మీడియా పాయింటు వద్దకు వచ్చారు.
సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్సీలు సతీష్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులు మాట్లాడేందుకు సిద్ధమవుతూ ప్రతులను చించివేశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న స్వామిగౌడ్ అడ్డుకోబోయారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నన్నపనేని కిందపడిపోయారు.
మేం వ్యతిరేకం: జూపూడి
తెలంగాణ బిల్లు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. ఏ సంప్రదాయం ప్రకారం విభజన చేస్తారన్నారు. బిల్లు ప్రవేశ పెట్టాలని చూస్తే పరిస్థితి ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుందన్నారు. బిల్లును తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. బిల్లు తేవడం అప్రజాస్వామికమన్నారు. రాజకీయ అవకాశాల కోసం కౌన్సిల్ వేదిక కాబోదన్నారు.
తమిళనాడుపై రభస
బిల్లులోని 'తమిళనాడు' అంశంపై రభస ఏర్పడింది. బిల్లులో తప్పులు దొర్లాయని, దీనిని చూస్తుంటే తమిళనాడు రాష్ట్రం గురించి ఉన్నట్లుగా ఉందని, లోపభూయిష్టమైన దీనిని తాము అంగీకరించేది లేదని టిడిపి ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చించడాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ నేతలకు బడ్జెట్ ప్రతులు చించినప్పుడు విలువలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బిల్లును చూస్తుంటే తమిళనాడు విభజన జరుగుతున్నట్లుగా ఉందన్నారు. సతీష్ రెడ్డి వాదన సరికాదని.. కేవలం తమిళనాడు మాదిరిగా విభజన జరుగుతున్నట్లు మాత్రమే ఉందని తెరాస ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి వివరించారు.