పులివెందులలో ఉద్రిక్తత: ఎంపీ అవినాష్ రెడ్డి హౌజ్ అరెస్ట్, టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Recommended Video
కడప: పులివెందులలో అభివృద్దిపై బహిరంగ చర్చపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీల సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో ఆదివారం నాడు పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. బహిరంగ చర్చకు తాము సిద్దంగా ఉన్నామని టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రకటించారు. పులివెందుల నుండి తాము పారిపోలేదని చెప్పారు.మరో వైపు వైసీసీ కార్యాలయంలో కూడ చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని బీటెక్ రవి అన్నారు.
పులివెందులలో అభివృద్ది విషయమై అధికార టిడిపి, విపక్ష వైసీపీ ప్రజా ప్రతినిధుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకొంటున్నాయి. ఈ తరుణంలోనే బహిరంగ చర్చ విషయమై రెండు పార్టీల నేతలు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుకొన్నారు.
ఆదివారం నాడు పులివెందు పూల అంగళ్ళ సర్కిల్ వద్ద బహిరంగ చర్చకు సిద్దమని ప్రకటించారు. అయితే ఈ బహిరంగ చర్చను పురస్కరించుకొని రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున పులివెందులకు చేరుకొండడంతో పోలీసులు ఇరువర్గాల వారిని అదుపు చేశారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హౌజ్ అరెస్ట్
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఆదివారం నాడు పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. పులివెందుల అభివృద్ధిపై చర్చ విషయమై కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పూల అంగళ్ళ సర్కిల్ వద్దకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడి నుంచి పోలీస్స్టేషన్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు మార్గమధ్యలో అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు.
ప్రజలకు వాస్తవాలు తెలియాలి
పులివెందులకు ఎవరేం చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై తాను బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. బహిరంగ చర్చకు టిడిపి నేతలు రావాలని అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు. చర్చలు ఫలవంతంగా ఉండాలన్నారు. ఏ పార్టీ ఏం చేసిందనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
మేం పారిపోలేదు
తాము ఎక్కడికి పారిపోలేదని పులివెందులలోనే ఉన్నామని ఎమ్మెల్సీ బిటెక్ రవి చెప్పారు.పూల అంగళ్ళ వద్ద బహిరంగ చర్చ నిర్వహిస్తే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని బిటెక్ రవి అభిప్రాయపడ్డారు. వైసీపీ కార్యాలయానికి తనతో పాటు ఎమ్మెల్సీ సతీష్రెడ్డి కూడ వస్తాడని చెప్పారు. అక్కడే పులివెందుల అభివృద్ది కోసం ఎవరేమీ చేశారో తేల్చుకొందామని సవాల్ విసిరారు.
చర్చల నుండి వెనక్కు వెళ్ళలేదు
పులివెందుల అభివృద్ది విషయమై తాము చర్చల నుండి వెనక్కు వెళ్ళలేదని ఎమ్మెల్సీ బిటెక్ రవి చెప్పారు. ప్రజల కోసం ఎవరేమీ చేశారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసమే బహిరంగ చర్చకు తాము సిద్దంగా ఉన్నామని రవి తెలిపారు.
ఉద్రిక్తత వాతావరణం
పులివెందుల అభివృద్దిపై రెండు పార్టీల నేతలు భారీగా మోహరించడంతో ముందు జాగ్రత్తగా ఇరు వర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు.రోడ్డపైకి రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు వచ్చి వాగ్వాదానికి దిగుతున్నారు. రాళ్ళ దాడి చేసుకొంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.