ఉండవల్లిలో ఉద్రిక్తత .. ప్రజావేదిక ప్రాంతానికి వెళ్లేందుకు టీడీపీ నేతల యత్నం .. అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉండవల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు నివాసానికి వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజావేదిక కూల్చివేత జరిగి నేటితో ఏడాది అయిన సందర్భంగా అక్కడకు వెళ్ళటానికి ప్రయత్నించిన టీడీపీ నేతలను అరెస్ట్ చెయ్యటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Recommended Video
గలీజ్ పనులకు నిలువెత్తు రూపం వైఎస్ జగన్ ...సిబీఐ ఛార్జిషీట్ వదిలింది అందుకే : బుద్దా కౌంటర్
ప్రజా వేదిక కూల్చివేసి నేటికి ఏడాది .. అక్కడికి వెళ్లేందుకు టీడీపీ నేతల యత్నం
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రజావేదిక అక్రమకట్టడం అని కూల్చివేసింది. ప్రజావేదికను ప్రభుత్వ కార్యాకలాపాలకు వాడుకోవాలని మాజీ సీఎం చంద్రబాబు సూచించినా సరే వైసీపీ ప్రభుత్వం కూల్చివేసి చూపించింది . ప్రజా వేదిక కూల్చివేసిన రోజు నేడు కావడంతో టిడిపి నేతలు ప్రజావేదిక కూల్చివేత ఏడాది అయిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రజావేదిక పరిసరాలకు వెళ్లడానికి ప్రయత్నం చేసిన టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రబాబు నివాసానికి వెళ్తున్నామని చెప్పినా టీడీపీ నేతల అరెస్ట్
ఇక తాము చంద్రబాబు నివాసానికి వెళ్తున్నామని చెప్పినప్పటికీ పోలీసులు టిడిపి నేతలను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజా వేదిక కూల్చివేతను నాడు టిడిపి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం అనుకున్నది చేసి తీరింది. ప్రజావేదికను కూల్చి వేసింది .ఒకప్పుడు ప్రజా వేదిక ఏ విధంగా ఉండేది ? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అనేది పరిశీలించడానికి టిడిపి నేతలు బయల్దేరిన క్రమంలో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు.
మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలింపు
ప్రజా వేదిక వద్దకు వచ్చే నాలుగు రహదారులలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు . తెలుగుదేశం పార్టీ నేతల వాహనాలు మినహా మిగతా వాటిని అనుమతించారు. ఉండవల్లి కరకట్ట వద్దకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవినేని ఉమామహేశ్వరరావు,వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు,ఆలపాటి రాజేంద్రప్రసాద్,శ్రవణ్ కుమార్ తదితరులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అప్రజాస్వామిక అరెస్ట్ లు అని మండిపడిన టీడీపీ నేతలు
దీనిపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నివాసానికి వెళుతుంటే అడ్డుకుంటున్నారని వారు విమర్శలు గుప్పించారు. వర్ల రామయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలను అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని వర్ల రామయ్య పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూల్చివేతలు ,అరాచకాలు తప్ప ఏపీలో పాలన ఏం జరిగిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .