ఆశ్రమం మూసివేతకు జేసీ పట్టు, కొందరి వల్ల చెడ్డపేరు.. పోలీసుల ఇష్టం!: బాబు ఆగ్రహం
అనంతపురం: జిల్లాలోని పొలమాడలో ఉద్రిక్త పరిస్థితులు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. ప్రభోధానంద ఆశ్రమాన్ని ఖాళీ చేయించేందుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అశ్రమాన్ని ఖాళీ చేయించాల్సిందేనని పట్టుబట్టారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయించేందుకు ఆక్టోబస్ రంగంలోకి దిగింది. ప్రత్యామ్నాయ ప్రాంతం చూపిస్తామని పోలీసులు ఆశ్రమవాసులకు చెబుతున్నారు.
అరెస్ట్ వారెంట్లో ట్విస్ట్, నోటీసులిస్తే స్పందించని బాబు: వీడియో కాన్ఫరెన్స్ ద్వారానా?
పొలమాడలో ఉద్రిక్త పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాజా పరిస్థితులతో సహా అన్నింటిని చంద్రబాబుకు ఆయన వివరించారు. మరోవైపు, సొంత పార్టీ నేతల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జేసీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఆయన జిల్లా నేతలతో మాట్లాడారు. జిల్లా ఇమేజ్ దెబ్బతింటోందని చంద్రబాబు వద్ద పలువురు నేతలు ప్రస్తావించారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతోందన్నారు.
శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని, అధికార పార్టీల నేతలు ఎవరైనా శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించమని చంద్రబాబు హెచ్చరించారు. కరువు జిల్లా అనంతపురంకు కియా వంటి పరిశ్రమల వల్ల మంచి పేరు వస్తుంటే కొందరి వల్ల చెడ్డపేరు వస్తోందని ఆగ్రహించారు. పార్టీలకు అతీతంగా పోలీసులు అక్కడ పరిస్థితులు అదుపులో ఉండేలా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చన్నారు.
ఆశ్రమాన్ని తరలించాలని డిమాండ్
గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజవకర్గంలోని చిన్నపొలమాడ, పెద్దపొలమాడ గ్రామాల్లో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. నిమజ్జనంకు వెళ్తున్న వినాయక విగ్రహాన్ని ప్రబోధానంద స్వామి వర్గీయులు అడ్డుకోవడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఆదివారం కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రబోధానంద శిష్యుల తీరుకు నిరసనగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం ఆశ్రమం వద్ద నిరసనకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమాన్ని ఇక్కడి నుంచి తరలించాలన్నారు. ఆశ్రమ నిర్వాహకుల తీరును నిరసిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.
పోలీసులు కూడా పరుగు తీశారు
ఆశ్రమం వెలుపల గ్రామస్తులు ఆందోళన చేస్తుండగా, ఆశ్రమం లోపలి నుంచి వచ్చిన శిష్యులు బయటకు వచ్చి దాడులకు పాల్పడ్డారు. దొరికిన వారిని రాడ్లు, కర్రలతో కొట్టారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఓ రాయి జేసీ దివాకర్ రెడ్డికి కూడా తగిలింది. ఆయన వాహనం దెబ్బతిన్నది. శిష్యుల ధాటికి ఆదివారం పోలీసులు కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
లాఠీఛార్జ్, బాష్పవాయు గోళాల ప్రయోగం
శిష్యుల తీరు పట్ల ఆగ్రహోద్రుడైన జేసీ.. ఆయన అనుచరులు టెంట్ వేసి నిరసనకు దిగారు. శిష్యులు అటువైపు దూసుకు వచ్చారు. పోలీసులు అప్రమత్తమై జేసీ దివాకర్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించారు. పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో శిష్యులు లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నారు.
పోలీసులకే ఆశ్రమం వద్ద చేదు
ఆశ్రమానికి చెందిన వారి దాడిలో పలువురు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శిష్యుల దాడి కారణంగా ఒకరు మృతి చెందారు. జేసీ దివాకర్ రెడ్డి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట తన అనుచరులతో కలిసి బైఠాయించారు. ఆశ్రమాన్ని తరలించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆశ్రమంలోకి వెళ్లేందుకు పోలీసు ఉన్నతాధికారులను కూడా నిర్వాహకులు తొలుత అనుమతించలేదు. చివరగా అనంతపురం ఎస్పీ అశోక్ కుమార్, జేసీ డిల్లీరావులను వేర్వేరుగా లోపలకు అనుమతించారు. అంతకుముందు వారు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే ససేమీరా అన్నారు. అంతేకాదు, తమను అరెస్టు చేయాలనుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని శిష్యులు బెదిరించారు. ఎస్పీ అశోక్, ఆర్డీవో ఆశ్రమానికి వెళ్లగానే తలుపులు వేసి, తాళం వేశారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పెద్దఎత్తున పోలీసు బలగాలు ఆశ్రమం చుట్టూ మోహరించాయి. మొత్తం ఘటనపై కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ 2 సుబ్బరాజు, అనంతపురం ఆర్డీవో, తాడిపత్రి డీఎస్పీ నేతృత్వంలో కమిటీని వేశారు.