భూమనపై పుకార్లు: సీఐడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, చెవిరెడ్డి అరెస్ట్
అమరావతి: గుంటూరు సీఐడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుని ఘటనలో భూమన కరుణాకరరెడ్డి హస్తం ఉందంటూ ఆయన్ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 11గంటలకు గుంటూరు సీఐడీ ఆఫీసుకు భూమన వచ్చారు. అప్పట్నుంచి విచారణ ఇంకా కొనసాగుతోంది.
తుని ఘటనపై ఒక దఫా విచారణ పూర్తైంది. ఈ మధ్యలో మరికొంత మందిని ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా భూమనకు మరోసారి నోటీసులిచ్చి విచారణకు రావాలని కోరిన సీఐడీ మంగళవారం సుమారు 7 గంటలకు పైగా భూమనను సుదీర్ఘంగా విచారణ కొనసాగుతోంది.
దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సీఐడీ ఆఫీసు వద్ద బైఠాయించిన వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. విచారణ పేరిట భూమనను వేధిస్తున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో సీఐడీ ఆఫీసు వద్ద ఆందోళనక పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్కు రంగం సిద్ధమైందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏ నిమిషంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో వైసీపీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై వైసీపీ నేతల సమావేశం ఏర్పాటు చేశారు.
భూమన అరెస్ట్ అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ నేతలు నిశితంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే సుదీర్ఘ విచారణ నేపథ్యంలో భూమనను అరెస్ట్ చేస్తారనే అనుమానాన్ని వైసీపీ కార్యకర్తలు వ్యక్తం చేశారు. అయితే భూమనను అరెస్ట్ చేస్తారా? లేదా అనే విషయాన్ని పక్కనబెడితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, అయినప్పటికీ సుదీర్ఘంగా విచారించడం వల్ల ఆయన మానసిక పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు.
భూమన ఆరోగ్యం బాగాలేదని రాత్రి ప్రయాణం చేసి ఇక్కడకు రావడానికి చాలా కష్టపడ్డారని ఆయన చెప్పారు. భూమన పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. భూమనను వెంటనే బయటకు పంపాలంటూ సీఐడీ కార్యాలయం ఎదుట చెవిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ప్రభుత్వం కావాలనే వైసీపీ నేతలను పీడిస్తోందని చెవిరెడ్డి ఆరోపించారు. వుయ్ వాంట్ జస్టిస్, సీఎం డౌన్ డౌన్ అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు సీఐడీ ఆఫీస్ ఎదుట నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితులు చేయి దాటి పోవడంతో సెక్యూరిటీ బారీకేడ్ల వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
గతంలో కూడా రెండు రోజులు విచారించారని, అసలు విచారణలో ఏం తెలుసుకుంటున్నారో తెలిపాలంటూ ఆందోళన చేశారు. దీంతో సీఐడీ కార్యాలయం వద్ద ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గుంటూరు సీఐడీ ఆఫీసు వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు కూడా మధ్యాహ్నాం ఇక్కడకు చేరుకుని భూమనను అరెస్ట్ చేస్తారా? లేదా మళ్లీ రేపు విచారణకు రమ్మంటారా? లేక విచారణ ముగిసిందా అనే విషయం మాకు చెప్పడం లేదని అంటున్నారు.