Srikakulam: జస్టిస్ ఫర్ సింధు: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం, హత్యపై భగ్గుమంటోన్న యువత..!
శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ విద్యార్థిని సింధు హత్యోదంతంపై శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని పలాసలో సోమవారం ఆరంభమైన ఆందోళనలు మంగళవారం నాటికి మరింత ఉధృతం అయ్యాయి. సింధుకు న్యాయం చేయాలని డిామండ్ చేస్తూ మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. సింధుపై అఘాయిత్యానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని నినదిస్తున్నారు.
Srikakulam: పట్టాల పక్కన విద్యార్థిని మృతదేహం: అత్యాచారం..హత్య: దిశ తరహా ఘటనగా..!
పట్టాల పక్కన మృతదేహాన్ని పడేసి..
జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం బాతుపురానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని సింధు.. ఆదివారం నాడు హత్యకు గురైన విషయం తెలిసిందే. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ఈ ఉదంతం జిల్లాల్లో కలకలానికి దారి తీసింది. తోటి విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలకు దిగారు. సోషల్ మీడియా వేదికగా సింధుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పలాసలో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు..
సింధు హత్యోదంతానికి నిరసనగా పలాసలో విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. పలాసలోని జీడిగింజల సెంటర్ నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. పలాసలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం మూడు రోడ్ల కూడలి వద్ద ధర్నా చేసి బైఠాయించారు. సింధుపై అత్యాచారానికి, హత్యకు పాల్పడిన కామాంధులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
నిందితులను అరెస్టు చేసేంత వరకూ ఆందోళనలు
విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు చేపట్టిన ఈ ఆందోళనలకు స్థానిక వామపక్ష నాయకులు మద్దతు పలికారు. ఫలితంగా మరింత ఉధృతమైంది. నిందితులను అరెస్టు చేసేంత వరకూ తాము వెనక్కి తగ్గేది లేదని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. అంతుముందు- పోస్టుమార్టమ్ అనంతరం సింధు మృతదేహాన్ని స్వగ్రామానికి అంబులెన్స్లో తరలించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను వారు అడ్డుకున్నారు. మృతదేహాన్ని తాము ర్యాలీగా తీసుకెళ్తామని పట్టుబట్టగా.. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. దీనితో వారు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
దర్యాప్తు ముమ్మరం..
సింధు అత్యాచారం, హత్యోదంతం కేసులో తాము దర్యాప్తును ముమ్మరం చేశామని శ్రీకాకుళం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమ్మిరెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, కొందరు అనుమానితులను విచారించామని అన్నారు. సింధు హంతకులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేస్తామని ఆయన మృతురాలి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.