బాపట్ల వ్యవసాయ కాలేజీ మూసివేత: విద్యార్థుల ఆందోళన, ఉద్రిక్తత
అమరావతి: గత రెండు రోజులుగా విద్యార్ధులు సమ్మె చేస్తున్న కారణంగా గుంటూరులోని బాపట్ల వ్యవసాయ కళాశాలను, హాస్టల్స్ను మూసివేస్తున్నట్లు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించిన అసోసియేట్ డీన్ పీఆర్ కే ప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు.
దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉత్తర్వులు జారీ చేయడంపై విద్యార్థులు అసోసియేషన్ చాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ నిరాహాద దీక్షకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు. కళాశాలలో మొత్తం 903 విద్యార్థులు చదువుకుంటున్నారు.
కళాశాలలో ఐసీఏఆర్ నుంచి వివిధ రాష్ట్రాల 90 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇలా ఆకస్మాత్తుగా కళాశాలను, హాస్టల్స్ను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో వారంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మామూలుగా ఇంటికి వెళ్లాలంటే రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకోవాలని, ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని విద్యార్థుల ఆవేదన చెందుతున్నారు.
కాగా, వారం క్రితం కళాశాలలో మద్దుకూరి సూర్యారావు(22) అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యారావు చావుకి కారణం అసిస్టెంట్ ప్రొపెసర్ వేధింపులే కారణమని తోటి విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఒకటి విచారణ చేపట్టి నివేదికను ఇచ్చింది.
అయితే నివేదికలో ఉన్న అంశాలను బయటపెట్టాలని విద్యార్థులు కోరగా, అందుకు కళాశాల యాజమాన్యం స్పందించలేదు. విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్ లకు సీల్డ్ కవర్ లో పంపుతామని చెప్పారు. దీంతో నివేదిక చూపించాలని పట్టుబట్టిన విద్యార్థులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు.