క్యాబినెట్ నిర్ణయాలతో అమరావతిలో ఉద్రిక్తత .. తనిఖీలతో వారధిపై ట్రాఫిక్ జామ్.. ఆర్టీసీ బస్సులు బంద్
Recommended Video
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాబినెట్ భేటీలో మూడు రాజధానులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది . నేటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న నేపధ్యంలో అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. అధికార వికేంద్రీకరణ బిల్లులకు ఇవాళ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ నేపధ్యంలో ఉద్రిక్త వాతావరం నెలకొంది. ఆర్టీసీ బస్సులు బంద్ చేశారు .
వెలగపూడిలో జగన్... కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ ..గోప్యంగా అజెండా .. హోం మంత్రికి నిరసన సెగ
క్యాబినెట్ భేటీలో మూడు రాజధానులకు ఆమోదం
కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా విశాఖపట్నంకు సచివాలయం, ప్రధాన కార్యాలయాలు , రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలోనే మూడు అసెంబ్లీ సెషన్స్ జరగనున్నాయి. అటు భూములు ఇచ్చిన రైతులకు కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
సీఆర్డీఏ ఉపసంహరణ నిర్ణయం .. రాజధాని రైతుల ఆగ్రహం
సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక ఇన్సైడర్ ట్రేడింగ్పై లోకాయుక్త విచారణ జరగనుంది. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీకి ఆమోదం తెలిపింది. ఇక క్యాబినెట్ తాజా నిర్ణయాల నేపధ్యంలో రాజధాని తరలింపు జరుగుతుందని రాజధాని రైతుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. దీనితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
తనిఖీలు ..విజయవాడ కృష్ణ వారధిపై ట్రాఫిక్ జామ్
ఈ నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధానికి వచ్చే రహదారులను కూడా పోలీసులు దిగ్బంధం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో విజయవాడ కృష్ణ వారధిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కాలేజీ బస్సులు, సర్వీస్ ఆటోలు, టూ వీలర్ వాహనాల ప్రయాణికులను సైతం ఆపి లగేజీలు తనిఖీ చేస్తున్నారు. అనుమానితుల ఐడీ కార్డులను పరిశీలించి మరీ పంపిస్తున్నారు. ఉద్యమ కారులు ఉన్నట్లైతే అరెస్టులు చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది.
విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే బస్సుల రద్దు
ఇక వారధిపై సుమారు 200 మందికి పైగా పోలీసులు తనఖీలు నిర్వహిస్తుండటంతోవారధిపై ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. తదుపరి ఆదేశాల వచ్చిన తర్వాత బస్సులను పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఏది ఏమైనా అమరావతి గ్రామాల్లో సీఎం జగన్ తాజా నిర్ణయంతో హై టెన్షన్ నెలకొంది.