బందరులో మేరీమాత విగ్రహం ధ్వంసం-ఎస్పీ ఆఫీసు పక్కనే అర్ధరాత్రి ఘటన
నిన్న ఆర్ధరాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని మేరీమాత విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఘటనాస్ధలికి చేరుకున్న క్రైస్తవులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా ఉండే మచిలీపట్నం నగరంలో అర్ధరాత్రి చిచ్చు రేగింది. నగరంలో క్రైస్తవులు పవిత్రంగా పూజించే మేరీమాత విగ్రహాన్ని అర్ధరాత్రి అగంతకులు ధ్వంసం చేశారు. ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని ఆగంతకులు కూల్చేశారు. ఎస్పీ కార్యాలయంతో పాటు స్ధానిక పీఎస్ లు కూడా ఉన్న ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవరో ఇప్పటివరకూ తెలియలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్ధలిలో సీసీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Recommended Video
ఘటన విషయం తెలియగానే ఆర్సీఎం చర్చి వద్దకు భారీగా క్రైస్తవులు చేరుకుంటున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరుతున్నారు. పోలీసులు ఇప్పటికే డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుల్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అదే సమయంలో ఆర్సీఎం చర్చితో పాటు పొరుగున ఉన్న సంస్ధల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించారు. దీంతో నిందితులు అదను చూసి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో క్రైస్తవులతో పాటు ఇతర మతాలు, కులాలకు చెందిన వారు భారీ సంఖ్యలో నివసిస్తున్నా గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని పోలీసులు చెప్తున్నారు.