మాచర్లలో టెన్షన్ .. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుతో టీడీపీ ఆందోళన
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు సద్దు మణగటం లేదు. ఒకరి పై ఒకరు దాడులు, ప్రతిదాడులు, లేదా విగ్రహాల ద్వసం, తొలగింపు ఘటనలతో రాష్ట్రంలో ఘర్షణలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా గుంటూరు జిల్లా మాచర్ల లో టెన్షన్ నెలకొంది. మాచర్ల మార్కెట్ యార్డు ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం తలెత్తింది. మాచర్ల మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని దానిని అధికారులు తొలగించారు. ఇక ఈ తొలగింపును నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
మళ్ళీ కృష్ణానది కరకట్టపై కూల్చివేతలు .. ఈసారి శివ క్షేత్ర నిర్మాణాల తొలగింపు
మహానేత ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపుకు పాల్పడుతోందని టిడిపి నాయకులు ఆరోపించారు. ఇక ఈ ధర్నా కార్యక్రమంలో టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్,జీవీ ఆంజనేయులు, పిన్నెల్లి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ధర్నాకు దిగిన టిడిపి నేతలతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు హామీ ఇచ్చారు. డీఎస్పీ హామీ మేరకు టీడీపీ నేతలు తమ ఆందోళన విరమించారు.
ఇక మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రి దాటాక తొలగించిన మున్సిపల్ ఆపరేషన్ అధికారులు ఆ విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని పేర్కొన్నారు. దీంతో అక్కడ సైతం టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహ తొలగింపును సీరియస్ గా తీసుకున్న టిడిపి నేతలు మహానేత మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఇక తాజాగా మాచర్లలో సైతం ఇలాంటి ఘటనే పునరావృతం కావడంతో టిడిపి నేతలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించకుండా కాపాడుకోవడానికి ఉద్యమించాలని భావిస్తున్నారు.