టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్, జమ్మలమడుగులో ఉద్రిక్తత
హైదరాబాద్: కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారంటూ తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికను ఆపాలంటూ టీడీపీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ తోపులాట జరగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఇద్దరు కార్యకర్తలు స్పృహ తప్పి పడిపోయారు.
అనంతలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ
అనంతపురం జిల్లాలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీని టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జేసీని నిలదీశారు. జేసీ కూడా ధీటుగానే స్పందించారు.
జమ్మలమడుగులో ఉద్రిక్తత
కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు కిడ్నాప్ చేసిన టీడీపీ కౌన్సిలర్ ముళ్లా జానీని అప్పగించాలంటూ మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారీగా కార్యకర్తలు జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పాతబస్టాండులోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అయితే అక్కడి నుంచి తప్పించుకున్న టీడీపీ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం వైపు తరలిరావడంతో భారీగా మోహరించిన పోలీసులు వారిని కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో రామసుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తమ కౌన్సిలర్ను అప్పగించాలని లేదా ఎన్నికను వాయిదా వేయాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కాగా, కిడ్నాప్కు గురైన జానీని కడప పోలీసులు గోవాలో గుర్తించారు.