కప్పల తక్కెడ పొలిటిక్స్: చంద్రబాబుకే కాదు, జగన్కూ పరీక్షే
ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆధిపత్య రాజకీయాలకు నెలవు అన్న అభిప్రాయం ఉన్నది. ఇది అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఖచ్చితంగా వర్తిస్తుంది.
హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆధిపత్య రాజకీయాలకు నెలవు అన్న అభిప్రాయం ఉన్నది. ఇది అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఖచ్చితంగా వర్తిస్తుంది. ప్రత్యేకించి ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విపక్షాలను అతలాకుతలం చేయడంలో దిట్ట. కానీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డికి ఇప్పటికీ వైఎస్ఆర్ హయాంలో చేసిన సంక్షేమ పథకాలు దన్నుగానే నిలిచాయి.
ఇదంతా ఒక ఎత్తయితే స్థానికంగా నాయకుల మధ్య ఎత్తులు, వ్యూహాల మధ్య జిల్లాల రాజకీయం మారిపోతూ ఉంటుంది. అటువంటి జిల్లాల్లో ప్రకాశం ఒకటి. ఇటు రాయలసీమకు అటు కోస్తాంధ్రకు మధ్య ఉన్న ప్రకాశం జిల్లాలో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు కొదవలేదు. ప్రత్యేకించి గొట్టిపాటి, కరణం కుటుంబాల మధ్య ఘర్షణ కొన్ని దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నది.
ఈ కప్పల తక్కెడ ప్రకాశం జిల్లా రాజకీయాలు చంద్రబాబుకు మాత్రమే కాకుండా జగన్కు కూడా పరీక్షనే. ఈ నాయకుడిని ఎలా నిలువరించాలనేది వారికి కష్టతరమైన పనే.
గొట్టిపాటిపై కరణం ఆగ్రహం.. కొడుకు భవితవ్యంపై ఫోకస్
2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ అంటే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత కరణం బలరాం క్రుష్ణమూర్తికి అసలే పడదు. ఇటీవల ఒక వ్యక్తి మరణం విషయంలో ఇరు గ్రూపులు పరస్పరం విమర్శలకు దిగాయి. కానీ అద్దంకి విషయంలో జోక్యం చేసుకోవద్దని టీడీపీ అధినేత - సీఎం చంద్రబాబు తేల్చేయడంతో కరణం బలరాం క్రుష్ణమూర్తి తన తనయుడు వెంకటేశ్ రాజకీయ భవితవ్యంపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఇదే తరహా పరిస్థితి జిల్లాల్లోని ఇతర నియోజకవర్గాల్లోనూ ఉన్నది.
Recommended Video
ఇదీ ప్రధాన, ద్వితీయ శ్రేణి నేతల పరిస్థితి
దీనికి తోడు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న అంచనాల మధ్య ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. కానీ తాజాగా కేంద్రం అటువంటి అవకాశమే లేదని తేల్చేయడంతో తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు సురక్షితమైన రాజకీయ పార్టీ అండ కోసం ఇప్పటి నుంచే అన్వేషణ ప్రారంభించారు. అవును మరి ఎన్నికల సమరాంగణానికి మరో ఏడాది గడువు మాత్రమే ఉన్నది. ప్రకాశం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ప్రధాన, ద్వితీయ శ్రేణి నాయకత్వం.. తమ పార్టీ అధినేతల వైఖరిపై ఆందోళన చెందుతున్నాయి. రెండు పార్టీల్లోనూ తొలి నుంచి పార్టీ జెండాలను భుజాన మోసిన కార్యకర్తలు, నాయకులు తమ భవితవ్యంపై మదన పడుతున్నారని సమాచారం.
ఆ స్థానాల్లో పరాజితల పరిస్థితేమిటి?
ఇప్పటివరకు అధికార తెలుగుదేశం పార్టీ ఫిరాయింపు రాజకీయాలను ప్రశ్నిస్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అలా చేస్తే ప్రజలు విశ్వసించరన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో నెలకొన్నది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు, తెలుగుదేశం పార్టీ నుంచి ఐదుగురు, ఆమంచిలో స్వతంత్ర్య శాసనసభ్యుడిగా ఆమంచి క్రుష్ణమోహన్ విజయం సాధించారు. ఆమంచి క్రుష్ణమోహన్ తోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన గొట్టిపాటి రవి కుమార్, పోతుల రామారావు, ముత్తుముల అశోక్ రెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజు ఎన్నికల తర్వాత ప్రగతి పేరిట ‘సైకిలు'పై స్వారీ చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన వారు.. భవిష్యత్ పై ఆశలు పెట్టుకున్న నేతలు అవకాశం లభిస్తుందా? లేదా? అని ఆందోళనకు గురవుతున్నారు.
చురుగ్గా ముక్కు కాశిరెడ్డి, ఉగ్రనర్సింహారెడ్డి
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నే రాంబాబు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక గత ఎన్నికల్లో ఓటమి పాలైన కరణం వెంకటేశ్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, కాంగ్రెస్ హయాంలో చక్రం తిప్పిన మానుగుంట మమీధర్ రెడ్డి, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అన్నే రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు రావడంతో గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఐవీ రెడ్డి వచ్చేసారి టిక్కెట్ తనదేనని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంశం చర్చనీయాంశంగా మారింది. అద్దంకిలో గొట్టిపాటి రవి కుమార్ కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తుండటంతో కరణం బలరాం తన కుమారుడితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
టీడీపీ గూటికి పోతుల రామారావు
కందుకూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన పోతుల రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీ సమన్వయకర్తగా తూమాటి మాధవరావు నియమితులయ్యారు. మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించడంతో అధికార, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైందని సమాచారం. మొత్తంగా అద్దంకి, గిద్దలూరు, కందుకూరు నియోజకవర్గాల్లోని టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతలకు ఇప్పటి నుంచి తమ రాజకీయ భవితవ్యంపై బెంగ పట్టుకున్నదని తెలుస్తున్నది.
అటు ఆమంచి.. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లాన్
కనిగిరి రాజకీయం మరో విచిత్ర పరిస్థితికి దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి.. తన పేరిట ఉగ్ర సేనతో రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నారు. మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి కూడా క్రమేపీ రాజకీయాలపై ద్రుష్టి సారించారు. చీరాలలో ఆమంచి క్రుష్ణమోహన్కు అవకాశం కల్పిస్తే. కనిగిరిలో రెడ్డి సామాజిక వర్గ నేతలకు చంద్రబాబు చాన్సిస్తారని తెలుస్తున్నది. గతంలో మాదిరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.. వచ్చే ఎన్నికల్లో యాదవ్ సామాజిక వర్గ నేతలకు చోటు కల్పిస్తారని వినికిడి.
`తేల్చేసిన చెంచు గరటయ్య
మార్కాపురం నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని వియ్యంకులైన కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసుల రెడ్డి ఒత్తిడి పెంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసులు రెడ్డి తొలుత మార్కాపురం నుంచి పోటీ చేస్తారని వార్తలొచ్చినా ఆయనే స్వయంగా కొట్టి పారేయడంతో సందిగ్ధత తొలిగిపోయింది.ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన ఒక నాయకుడు తెర వెనుక రాజకీయం జరుపుతున్నారని, దానిపై స్పష్టత వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని జగన్ తేల్చి చెప్పారని సమాచారం. అన్నింటికంటే ముఖ్యంగా అద్దంకిలో తాజా పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. కరణం బలరాం, గొట్టిపాటి రవి కుమార్ మధ్య సాగుతున్న ఆధిపత్య పోరును జాగ్రత్తగా గమనిస్తున్నది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా ఉన్న సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్య స్వయంగా జగన్తోనే చర్చించారని తెలియవచ్చింది. తనకు.. కాదంటే తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే మళ్లీ దెబ్బ తింటారని ఝలక్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం.