వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు: వాగ్యుద్దం.. ఉద్రిక్తత!
కడప: కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గురువారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులు, వారి అనుచరులను తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. గ్రామంలోకి అడుగు పెట్టనివ్వలేదు. దీనితో రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కారు, బైకుల నిండా మద్యం బాటిళ్లే: 7500 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప లోక్ సభ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఉదయం నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. కావాలి జగన్, రావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా.. వారు సుగమంచి పల్లి గ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో సుగమంచి పల్లె గ్రామం బయట.. రోడ్డు మీదే నాయకుల వాహనాలను అడ్డుకున్నారు.
గ్రామంలోకి వెళ్లనివ్వబోమని, వెనక్కి తిరిగి వెళ్లాలని డిమాండ్ చేశారు. దీనితో సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కారు నుంచి కిందికి దిగారు. వారి వెంట అనుచరులు, సుగమంచి పల్లెకు చెందిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎలా వెళ్లనివ్వరో చూస్తామంటూ సవాలు, ప్రతిసవాలు విసురుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే జమ్మలమడుగు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు పక్షాల వారిని శాంతింపజేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వెనక్కి తగ్గారు. అనంతరం సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డిల ప్రచారం కొనసాగింది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆది నారాయణ రెడ్డి అనంతరం పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. చంద్రబాబు కేబినెట్ లో చోటు కూడా దక్కించుకున్నారు. టీడీపీ నుంచి కడప లోక్ సభ స్థానానికి ఆది నారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. పాత కాపు, మాజీ మంత్రి పీ రామసుబ్బా రెడ్డి తెలుగుదేశం తరఫున జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఈ రెండు స్థానాలను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలనే ఉద్దేశంతో.. ఎక్కడికక్కడ తమను అడ్డుకుంటోందని వైఎస్ఆర్ సీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో కూడా పలుమార్లు అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డిలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి.