రీపోలింగ్లో ఉద్రిక్తత: తల్లి ఓటు వేయబోయిన టీడీపీ నేత : అడ్డుకున్న వైసీపీ ఏజెంట్లు
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏడు చోట్ల ఆదివారం ఉదయం ఆరంభమైన రీపోలింగ్ మధ్యాహ్నానికి ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారి తీసింది. ఓ దశలో తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని.. వైఎస్ఆర్ సీపీ పోలింగ్ ఏజెంట్పై దౌర్జన్యానికి దిగారు. ఆయనతో వాగ్వివాదానికి దిగారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినీ అడ్డుకున్నారు. ఫలితంగా- ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కమ్మపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మునిచంద్ర నాయుడు తన తల్లి ఓటును తాను వేయబోయారు. తన తల్లి పోలింగ్ కేంద్రం వరకూ రాలేదని అంటూ ఆయన టీడీపీ ఏజెంట్ల సహకారంతో తన తల్లి ఓటును వేయబోతుండగా.. వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. అలా ఎలా వేస్తారని ప్రశ్నించారు. తాము రవాణా వసతిని కల్పిస్తామని, అవసరమైతే ఇంటికెళ్లి తమ భుజాల మీద ఎత్తుకుని వస్తామని వైఎస్ఆర్ సీపీ పోలింగ్ ఏజెంట్లు మునిచంద్ర నాయుడికి సూచించారు. అయినప్పటికీ- ఆయన వినిపించుకోలేదు. తన తల్లి ఓటును తాను వేసి తీరుతానంటూ భీష్మించారు.
చంద్రగిరి రీపోలింగ్: తొలి రెండు గంటలు సజావుగా!
దీనితో రెండు వర్గల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలుసుకుని రెండు పార్టీల అభ్యర్థులు పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కమ్మపల్లెకు బయలుదేరారు. ముందుగా వచ్చిన పులివర్తి నాని.. వైఎఎస్ఆర్ సీపీ పోలింగ్ ఏజెంట్లతో వాగ్వివాదానికి దిగారు. మునిచంద్ర నాయుడైనా, ఆయన తల్లయినా ఓటు వేసేది సైకిల్కేనని, ఇందులో అభ్యంతరం ఎందుకంటూ నిలదీశారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందిపై కూడా చిందులు తొక్కారు. ఈ లోగా- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆయనను గమనించిన పులివర్తి నాని.. తన గ్రామంలో ఎందుకు తిరుగుతున్నావంటూ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెవిరెడ్డి చొక్కా పట్టుకోవడానికి ప్రయత్నించారు.
దీనితో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బందోబస్తులో ఉన్న పోలీసులు సకాలంలో స్పందించారు. వారిని శాంతింపజేశారు. మునిచంద్ర నాయుడిని అదుపులోకి తీసుకున్ని, పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకుముందు- పులివర్తి నాని భార్య అదే పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. వృద్ధులను పోలింగ్ కేంద్రానికి తరలించడానికి ఎలాంటి వసతినీ కల్పించలేదని ఆమె ఆరోపించారు. మునిచంద్ర నాయుడి తల్లిని దృష్టిలో ఉంచుకుని ఆమె నిరసన వ్యక్తం చేశారు.
కాగా- ఈ ఎన్ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, పులివర్తి వారి పల్లి, వెంకట్రామాపురం, కొత్త కండ్రిగ, కుప్పంబాదూరు, కాలేపల్లిల్లో పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నానికి ఇంచుమించుగా 40 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. పోలింగ్ ముగిసే సమయానికి 70 నుంచి 80 శాతం మేర పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.