బాలికపై అత్యాచారం నేపథ్యంలో దాచేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత...సిఎం ఆదేశాలు
Recommended Video
గుంటూరు:దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం నేపథ్యంలో గ్రామస్తులు, ప్రజా, మహిళా సంఘాలు ఆందోళనకు దిగడంతో దాచేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ బంద్ కొనసాగుతుండగా మరోవైపు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలతో గ్రామం అట్టుడుకి పోతోంది.
చదవండి: దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై వృద్ధుడు రేప్: స్పందించిన జగన్, పవన్ కళ్యాణ్
నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు ఘటనాస్థలానికి చేరుకుని, ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.
మైనర్ పై అత్యాచారం...ఫిర్యాదు
నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసిఫా అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దాచేపల్లిలో అలాంటిదే మరో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. 9 ఏళ్ల బాలికపై అన్నం సుబ్బయ్య(50) అనే వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. బాధిత తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు నిందితుడిని పట్టుకోవాలంటూ స్థానికులతో పాటు వివిధ సంఘాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దాచేపల్లిలో పోలీస్ బలగాలను భారీగా మోహరించారు.
సిఎం ఆదేశాలు...అండగా నిలవండి
గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. నిందితుడిని ఏమాత్రం ఉపేక్షించవద్దని సూచించారు. సిఎం ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం అంతా కదిలింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధికారులతో హుటాహుటిన సమావేశమయ్యారు.
హోం మంత్రి...ఆరా
ఈ ఘటన విషయమైపై డిప్యూటీ సిఎం చినరాజప్ప కూడా గుంటూరు రూరల్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఘటన పూర్వాపరాల గురించి ఆరా తీశారు. నిందితునిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని, బంద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు.
జిల్లా అధికారుల,నేతల...పరామర్శ
ఇదిలావుండగా అత్యాచారానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను జిల్లాకలెక్టర్ కోనా శశిధర్ తో సహా స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, వైసిపి ఎమ్మెల్యే ముస్తఫా, ప్రజా మహిళా సంఘాల నేతలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నబాలికను పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.