చిరంజీవి, వంగవీటి రంగా ఫ్లెక్సీల చించివేత: బైఠాయింపు, ఉద్రిక్తత
కృష్ణా జిల్లాలో దుండగులు చిరంజీవి, వంగవీటి రంగా ఫ్లెక్సీలను చించేశారు. దీంతో కైకలూరు రోడ్డుపై తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం అటపాకలో సోమవారం తెల్లవారుజామున చిరంజీవి, వంగవీటి రంగా ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో భీమవరం, కైకలూరు రహదారిపై చిరంజీవి, రంగా అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని ఆందోళన విరమించాలని, ఘటనకు పాల్పడినవారిని పట్టుకుంటామని అన్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు.
అయినా వారు ఆందోళన విరమించలేదు. అయితే, ఆందోళనకారులను కాస్తా పక్కకు తప్పించి వాహనాలు వెళ్లడానికి దారి ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు ర్యాలీగా కైకలూరు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.