నిన్న జనసేన..నేడు టీడీపీ: వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ముట్టడి!
నెల్లూరు: తూర్పు గోదావరి జిల్లాలోని మలికిపురం పోలీస్ స్టేషన్ ను జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ముట్టడించిన ఘటనకు సంబంధించిన ప్రకంపనలు ఇంకా సద్దు మణగకముందే ఈ సారి తెలుగుదేశం పార్టీ నాయకులు మరో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. నెల్లూరులోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 50 మంది పోలీస్ స్టేషన్ ను ముట్టడించడం, పోలీసులతో వాగ్వివాదానికి దిగడం.. నగరంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా ఇళ్లను నిర్మించారనే కారణంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని కూల్చివేశారు. ఈ సందర్భంగా కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించడం వారి ఆందోళనకు కారణమైంది.
వైఎస్
జగన్
చిన్నకుమార్తెకు
యుఎస్
టాప్
యూనివర్శిటీలో
సీటు
నెల్లూరులో వెంకటేశ్వరపురం జనార్ధన్రెడ్డి కాలనీలో తెలుగుదేశం పార్టీకి నాయకుడికి చెందిన ఇంటితోపాటు మరో రెండింటిని అధికారులు కూల్చివేశారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రసాద్ ఇంటిని, దాని పక్కనే 80 శాతం పూర్తయిన టీడీపీ కార్పొరేటర్ సల్మా జహీర్, షేక్ జావేద్ ల ఇళ్లను కూల్చివేశారు. అడ్డకోడానికి వెళ్లిన నెల్లూరు జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి బక్రీద్ పండుగ రోజే వాటిని తొలగించడానికి అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ అడ్డుకున్నారు. దీనితో వెనుదిరిగిన అధికారులు మరుసటి రోజు తెల్లవారుజామున కూల్చివేతలను ప్రారంభించారు. ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.
వెంకటేశ్వరపురం, జనార్దన్రెడ్డి కాలనీని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో సుమారు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. మూడు భారీ భవనాలను కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సహా పలువురు నాయకులు సంఘటనాస్థలానికి చేరుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ నాయకులను అరెస్టు చేసిన సమాచారం తెలిసిన వెంటనే పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 50 నుంచి వందమంది వరకు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి చేరుకుని నినాదాలు చేయడంతో పరిసర ప్రాంతాలు హోరెత్తిపోయాయి.