అచ్చెన్నాయుడి అరెస్ట్ పై మండలిలోఉద్రిక్తత - మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీల తోపులాట- వాయిదా
ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. మూడు రాజధానుల బిల్లులు సభ ముందుకు రావడంతో టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు పార్టీ విప్ మేరకు ఇవాళ సభకు హాజరయ్యారు. బిల్లులపై చర్చ చేపట్టవద్దంటూ నోటీసులు కూడా ఇచ్చారు. ఇదే తరుణంలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చ సందర్భంగా ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
ఏపీ బడ్జెట్లో అప్పులే.. ఆదాయమేది?: మోడీతో విభేదాలు లేవంటూ చంద్రబాబు
బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారాన్ని టీడీపీ సభ్యులు ప్రస్తావించారు. బీసీ నాయకులను ప్రభుత్వం అణగదొక్కుతోందని టీడీపీ ఎమ్మెల్సీ జగదీష్ ఆరోపించారు. 300 మంది పోలీసులతో అరెస్ట్ చేసి ఆపరేషన్ అయిన వ్యక్తిని సుదీర్ఘ ప్రయాణంతో ప్రభుత్వం వేధించిందని విమర్శించారు. దీంతో మండలి నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకున్నారు. దొంగతనం చేశాడు కాబట్టే అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లాడని వ్యాఖ్యానించారు. దీంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది.
ముద్రగడ పద్మనాభాన్ని గతంలో ఉద్యమ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం మూడు వేల మంది పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించిందని మంత్రి అనిల్ ఆరోపించారు. దీనికి కౌంటర్ గా గడ్డం పెంచిన రౌడీలు సభకు వస్తున్నారని సోషల్ మీడియాలో సైతం చర్చ జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. దీంతో రెచ్చిపోయిన మంత్రి అనిల్... గడ్డం ఉన్న వారంతా రౌడీలేనే, ఛైర్మన్ షరీఫ్ కు కూడా గడ్డం ఉందని రౌడీ అంటారా అంటూ ప్రశ్నించారు. గడ్డం ఉందని చంద్రబాబున కూడా రౌడీ అనాలా అని నిలదీశారు.
Recommended Video
దీంతో సభలో వాతావరణం పూర్తి ఉద్రిక్తంగా మారిపోయింది. పరిస్ధితి విషమించడంతో షరీఫ్ సభను వాయిదా వేశారు. అయినా అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతలు ఆగలేదు. సభ వాయిదా తర్వాత కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగింది. మంత్రి అనిల్, టీడీపీ ఎమ్మెల్సీ జగదీష్... ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి అనిల్ ను మరో మంత్రి అనిల్, ఎమ్మెల్సీ జగదీష్ ను మరో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి నిలువరించారు. మీ ప్రభుత్వ హయాంలో బెట్టింగ్ ల విషయంలో నా మీద ఒక్క పిట్టి కేసు కూడా పెట్టలేదని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. నిజాయితీగా బయటకి వచ్చా ఏం పీకలేకపోయారు అని అనిల్ ఎద్దేవా చేశారు.