మందడంలో టెన్షన్..టెన్షన్: స్థానిక మహిళల అరెస్ట్..గాయాలు: పోలీసులతో ఘర్షణ..!
Recommended Video
అమరావతి గ్రామాల్లో రాజధాని తరలింపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. మందడం గ్రామం నుండి సచివాలయం కు వెళ్లే దారిలో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డు పైన భైఠాయించారు. వారిని పోలీసులు బలవంతంగా తొలిగించారు. వారి పైన దురుసుగా ప్రవర్తించిన పోలీసుల పైన స్థానికులు ఘర్షణ పడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
మహిళలను ఎక్కించుకొని వెళ్తున్న పోలీసు వ్యాన్ ను అడ్డుకొనేందుకు స్థానికులు వ్యాన్ కు అడ్డంగా రోడ్డు పైన పడుకున్నారు. బస్సు ముందుకు వెళ్లటంతో ఒక రైతు చేతికి స్వల్ప గాయమైంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళల ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ స్థానికులు నినాదాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
రాజధాని నిరసనల్లో భాగంగా.. మందడం గ్రామంలో స్థానికులు ర్యాలీ నిర్వహించారు. కొంత మంది మహిళలు సచివాలయం రోడ్డు వద్ద ధర్నాకు దిగారు. వీరిని అక్కడి నుండి తొలిగించేందుకు మహిళా పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. బలవంతంగా వారిని పోలీసు వ్యాన్ ఎక్కించారు. ఆ సమయంలో ఇబ్బంది పడిన స్థానిక మహిళలు పెద్ద పెట్టున రోదించారు. పోలీసులు తమతో వ్యవహరించి న తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసారు. వారికి మద్దతుగా అక్కడే ధర్నా చేస్తున్న మహిళలు.. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
బలవంతంగా తమను అదుపులోకి తీసుకోవటం పైన నిరసన వ్యక్తం చేసారు. ఒకే బస్సులో అనేక మందిని ఎక్కించటం ద్వారా వారు ఒత్తిడికి లోనయ్యారు. దీంతో..అక్కడకు చేరుకున్న గ్రామస్థులు వెంటనే వ్యాన్ లోకి ఎక్కించిన మహిళలను వదిలేయాలంటూ ఆందోళనకు దిగారు. వ్యాన్ ముందుకు వెళ్లకుండా రోడ్డు పైన అడ్డంగా పడుకొన్నారు. దీంతో..వారిని తప్పించేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరారు.
పోలీసులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును మహిళలు తప్పు బట్టారు. తమ గొంతు పట్టుకొని నేరస్థులతో మాదిరి దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో..అక్కడ చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు వ్యాన్ ఎక్కించిన వారిని దింపేసారు. అయినా స్థానికులు శాంతించలేదు. తమతో వ్యవహరిస్తున్న తీరు పైన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.