గంటాకు టెన్షన్ మొదలైందా? జగన్ గంటాకు షాక్ ఇవ్వనున్నారా ?
ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ పారదర్శకమైన పాలన అందిస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఖంగు తింటున్నారు. ఇక మంత్రివర్గ ఏర్పాటులోనూ తగు జాగ్రత్తలు తీసుకున్న జగన్ ఎవరు వేలెత్తి చూపకుండా అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ పూర్తి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి పాలనకు శ్రీకారం చుట్టారు.గతంలో టిడిపి హయాంలో చేసిన అవినీతిపై అనేకమార్లు ఆరోపణలు చేసిన జగన్ ఇప్పుడు అవినీతి పుట్టలు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో టిడిపి నాయకులలో టెన్షన్ మొదలైంది.
మాజీ స్పీకర్ కోడెలకు వరుస షాక్లు: కొడుకు , కూతురుపై కేసులు.. నెక్స్ట్ ఎవరు..?
కోడెల కుమార్తె, కుమారుడిపై కేసులు .. జగన్ నిర్ణయంతో టెన్షన్ పడుతున్న మాజీ మంత్రి గంటా
ఇప్పటికే కోడెల శివప్రసాద్ కుమార్తె, కుమారుడిపై తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడ్డారని, 'కే' టాక్స్ వసూలు చేశారని కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు మిగతా టిడిపి నేతలకు, మంత్రులకు భయం పట్టుకుంది. అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తానని ప్రకటించిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి హయాంలో జరిగిన అవినీతి ని బయటకు తీయడం పై ప్రత్యేకమైన దృష్టి సారించారు.అందులో భాగంగా ఇప్పుడు గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు చెక్ పెట్టే పనిలో జగన్ సర్కార్ ఉన్నట్లుగా సమాచారం.
విశాఖ భూ కుంభకోణంపై విచారణ చెయ్యాలని జగన్ ఆదేశం .... టీడీపీ హయాంలోనే కుంభకోణం
గడిచిన ఐదేళ్లలో విశాఖ జిల్లాలో భూ దందాలు విపరీతంగా జరిగాయి. విశాఖ భూ కుంభకోణం లో ఉన్నది టిడిపి నేతలేనని అప్పట్లో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాలో వైసిపి నాడు ఎంతో పోరాటం చేసినప్పటికీ నాడు అధికార పార్టీగా ఉన్న టిడిపి ఈ వ్యవహారంపై ఏమాత్రం స్పందించలేదు. గంటా శ్రీనివాసరావు వర్గంగా ఉన్న భీమిలి కి చెందిన నేతలే పెద్ద ఎత్తున అక్రమ భూ సేకరణ చేశారని, అందుకే ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని అప్పట్లో పెద్దఎత్తున చర్చ సాగింది.ఇక ఇప్పుడు జగన్ విశాఖ భూ కుంభకోణాన్ని బయటకు లాగి కుంభకోణానికి కారణమైన బాధ్యులను చట్టరీత్యా శిక్షించాలనే ఆలోచనలో ఉన్నారు.
దిక్కుతోచని స్థితిలో టీడీపీ నాయకులు .. అవినీతి గట్టు రట్టు చేసేపనిలో జగన్ సర్కార్
అందుకు తగినట్లుగా అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారు, అక్రమ భూ దందాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పిన జగన్ ఇప్పుడు ఆ దిశగా తన పని మొదలు పెట్టారు. దీంతో గంటా శ్రీనివాసరావు లోనూ, గంటా వర్గంలోనూ భయాందోళన పట్టుకుంది. విశాఖ భూ కుంభకోణ పాత్రధారులు, సూత్రధారులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లడం తప్పదని తాజాగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో టిడిపి వర్గం దిక్కుతోచని స్థితిలో పడింది. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన గంటా అవినీతి బయట పెట్టేందుకు జగన్ ఆదేశాలు జారీ చేయడం, విశాఖ భూ కుంభకోణంపై ప్రత్యేక దృష్టి పెట్టడం గంటా కు చెక్ పెట్టేందుకేనని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. సీఎంగా జగన్ వేసిన స్కెచ్ అదిరిందని సంతోష పడుతున్నాయి.