ఎర్రచందనం స్మగ్లర్ల ఎత్తుగడలు:తిరుమలలో భక్తుల మధ్యే మకాం...అరెస్టు సందర్భంగా హైడ్రామా
తిరుపతి:తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ సందర్భంగా హై డ్రామా చోటుచేసుకుంది. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు తమిళనాడు నుంచి వచ్చిన పోలీసులు ఎట్టకేలకు వారి స్థావరం గుర్తించారు.
తిరుమలలో భక్తుల మధ్యే మకాం వేసి ఉన్న వారిని మంగళవారం అర్థరాత్రి తమిళనాడు పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీపుకున్నారు. అర్థరాత్రి సమయంలో పోలీసులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా చుట్టుముట్టి తమ మధ్యలో ఉన్న కొంతమందిని అరెస్ట్ చేస్తుండటం, కొంతమంది ఈడ్చి పోలీసు వాహనాల్లో వేస్తుండటంతో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఆ తరువాత అక్కడ ఉన్న కొందరు తమిళనాడు భక్తులు పోలీసులను విషయం ఏమిటో అడిగి కనుక్కొని చెప్పడంతో అప్పుడు అసలు సంగతి అర్థమై ఔరా!.. అనుకున్నారు. తమిళనాడు,చోడవరంకు చెందిన ఎర్ర చందనం కూలీలు అక్కడ నుంచి వచ్చి శేషాచలం అడవులలో ఎర్రచందనం చెట్లను నరికి స్మగ్లర్లకు అప్పగించేవారు. అయితే ఇటీవల ఎర్రచందనం స్మగర్లు,కూలీలపై నిఘా ముమ్మరం కావడంతో వారు తెలివిగా ఆలోచించి తిరుమలలో భక్తుల మధ్యే ఆవాసం ఏర్పరుచుకున్నారు.
అయితే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో పాటు ఆ ఎర్రచందనం స్మగ్లర్లలో కొందరు పాత నేరస్థులు కూడా ఉన్నారన్న విషయం తెలిసింది.దీంతో అర్ధరాత్రి నేరుగా తిరుమల చేరుకున్న తమిళ పోలీసులు భక్తుల్లో కలసి ఎక్కడో మకాం వేసిన ఎర్రచందనం స్మగ్లర్ల కోసం తీవ్ర అన్వేషణ సాగించారు. చివరకు వారిని గుర్తించడం ద్వారా తమ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. ఆ విధంగా భక్తుల మధ్యే మకాం వేసిన 11 మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.