లాక్ డౌన్ ఆంక్షలతో బెంబేలు: పెళ్ళిళ్ళను నమ్ముకుని జీవనం సాగించే వారి బతుకు కుదేలు
కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం పెళ్ళిళ్ళ మీద ఆధారపడి జీవనం సాగించే వారి బతుకులను కుదేలు చేస్తుంది. ఫంక్షన్ హాల్స్ యజమానుల నుండి పురోహితులు, డెకరేషన్ , లైటింగ్ , వంట సిబ్బంది , పని మనుషులు , కేటరింగ్ , బ్యాండ్ , ఇలా పెళ్లి జరిగితే తద్వారా జీవించే ఇన్ని వ్యవస్థలు ప్రస్తుతం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దిక్కు తోచని స్థితికి చేరుకున్నాయి.
పెళ్ళిళ్ళు లేక , ఎప్పటికి ఆంక్షలు సడలిస్తారో తెలీక కుదేలవుతున్న ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడింది . లక్షల్లో ఉన్న ఫంక్షన్ హాళ్ళు , కళ్యాణ మండపాలు అన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అన్ని చోట్ల గేట్లకు లాక్ చేసిన పరిస్థితి సదరు ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలను నిద్ర పోనివ్వటం లేదు. ఒక పక్క బ్యాంకుల నుండి ఫంక్షన్ హాల్స్ కోసం తీసుకున్న లోన్ ఈఎంఐలు చెల్లించాలి . ఇక ఇదే సమయంలో ఇంకా ఎంత కాలం పాటు వివాహాది శుభ కార్యాలు నిర్వహించకూడదో తెలీని పరిస్థితి . ఇక ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా పెళ్లిళ్లకు మాత్రం ఆంక్షలు ఉంటాయి. కేవలం 10 మందితో పెళ్ళిళ్ళు జరిపించాలి అని చెప్తున్న వేళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, లోన్లు తీసుకున్న ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు తీవ్ర నష్టాలకు గురవుతారు . ఇక వారికి ఉపశమనం కలిగించే ఏ ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోని సర్కార్ పెళ్ళిళ్ళు మాత్రం మందీ మార్బలంతో నిర్వహించొద్దని చేతులు దులుపుకుంటుంది .
కరోనా లాక్ డౌన్ తో పురోహితులకు ఉపాధి కరువు
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు పెళ్ళిళ్ళు కూడా ఇప్పటికే ఇళ్ళల్లో గుట్టు చప్పుడు కాకుండా ఇళ్ళల్లో చేసుకుంటున్నారు. ఇక ఆన్ లైన్ పెళ్ళిళ్ళ తంతు కూడా కొనసాగుతున్న వేళ పురోహితులకు పని లేకుండా పోయింది. పురోహితులు "మాంగల్యం తంతు నామేనా మమ జీవన హేతునా" అన్న మంత్రోచ్చారణ అవసరమే లేకుండా పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. దీంతో పురోహితుల జీవనం కుదేలవుతుంది . పెళ్ళిళ్ళ మీద ఆధారపడిన పురోహితుల కుటుంబాలు దిక్కు తోచని స్థితికి చేరుకుంటున్నారు . మళ్ళీ ఎప్పుడు ప్రభుత్వాలు పెళ్లిళ్లకు అనుమతి ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు .
మేళ తాళాలు , భాజాభజంత్రీలు లేవు ...వాయిద్య కారులకు బతుకు బరువు
మేళతాళాలు, భాజా భజంత్రీలు మోత వినపడుతుంటేనే పెళ్లి జరుగుతుంది అన్న భావన వస్తుంది. కానీ కరోనా లాక్ డౌన్ ప్రభావంతో ఆ పరిస్థితి లేదు . సన్నాయి వాయిద్యాల వారికి , బ్యాండ్ మేళం ద్వారా జీవనం సాగించే వారికి లాక్ డౌన్ తో పాటు కరోనా పెద్ద కోలుకోలేని దెబ్బ కొట్ట్టింది. శుభకార్యాలకు భాజా బజంత్రీలు వాయించే వారు కాస్తా ఇప్పుడు విషాద సంగీతం వాళ్ళ జీవితాల్లోనే మోగుతుంటే ఏం చెయ్యాలో అర్ధం కాక దిక్కులు చూస్తున్నారు.
డెకరేషన్ వాళ్ళ జీవితాలపై కరోనా దెబ్బ
పెళ్లి అనగానే మండపం పూలతో అందంగా డెకరేషన్ చేసి కొత్త వధూవరుల నూతన ప్రయాణానికి పెళ్లి ద్వారా స్వాగతం పలుకుతారు డెకరేషన్ పనులు నిర్వహించే వారు . ఇక వారికి ఇప్పుడు ఉప్పాది కరువు. ఇక వారు వినియోగించే పువ్వుల అవసరం కూడా లేకపోవటం తో సదరు పూల సాగు చేసిన వారికి బతుకు బరువు . మొత్తంగా పెళ్లి మండపాలు అందంగా డెకరేట్ చేసే డెకరేషన్ కార్మికుల జీవితాల్లో కరోనా ఆనందం లేకుండా చేసింది .
అందంగా లైటింగ్ పెట్టే ఎలక్ట్రీషియన్ ల జీవితాల్లో చీకట్లు
పెళ్లి అనగానే ఇల్లు, వాకిళ్ళు మాత్రమే కాదు కల్యాణం జరిగే మండపాలలో కూడా అందంగా లైటింగ్ పెట్టి కోటి కాంతులతో నవ వధూ వరులకు కొత్త జీవితంపై ఆశలు చిగురింపజేస్తారు ఎలక్ట్రీషియన్ పని వాళ్ళు . ఇక కరోనా వారి జీవితాల్లోనూ చీకటి నింపింది. పనుల్లేక , పెళ్ళిళ్ళు జరగక ఎలక్ట్రీషియన్ వర్క్ చేసే వాళ్ళు తెగ ఇబ్బంది పడుతున్నారు. వీరంతా ప్రభుత్వం తమ విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరుతున్నారు . ఇక వంట వాళ్ళు కూడా తమకు వంటలకు అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు.
ఉపాధి ఎలా అని ఆవేదన చెందుతున్న వంట వాళ్ళు ,పెళ్లిళ్లకు పని చేసే కార్మికులు
వివాహాది శుభ కార్యాలంటే చాలా మంది వంట పనుల ద్వారా ఉపాధి పొందుతారు. ఇప్పుడు వారి ఉపాధి కూడా పోయింది. అందరికీ రుచికరమైన వంటలు చేసి పెట్టేవారు ఇప్పుడు వంటలు చెయ్యటానికి లేక ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు . ఒక్క వంట వాళ్ళు మాత్రమే కాదు , శుభ్రం చేసే పని వాళ్ళు ఇలా ఒకరేంటి ఒక పెళ్లి జరగాలంటే వందలాదిగా కార్మికులు పని చెయ్యాలి . ప్రత్యక్షంగా లక్షల మంది కార్మికులు, పరోక్షంగా వీటి మీద ఆధారపడిన వ్యవస్థలు కోట్ల సంఖ్యలో పెళ్ళిళ్ళ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాంటి పెళ్ళిళ్ళు కరోనా నేపధ్యంలో నిర్వహించకూడదని , లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసినా పెళ్ళిళ్ళపై ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వాలు చెప్పటంతో శుభకార్యాల మీద ఆధారపడిన ఇంత మంది జీవితాలు దుర్భరంగా మారనున్నాయి.