కడప: తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్ట్ వద్ద రైతుల నిరసన...ఉద్రిక్తత
కడప:వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టు వద్ద రైతులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న రైతులు, ప్రాజక్టులోకి వెళ్లనివ్వకుండా అధికారులను అడ్డుకున్నట్లు తెలిసింది.
యురేనియం ప్రాజెక్టు వ్యర్థాలతో భూగర్భ జలాలతో పాటు, త్రాగు నీరు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు, భూములకు నష్ట పరిహారం చెల్లిస్తే గ్రామాలు ఖాళీచేసి వెళ్లి పోతామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ప్రాజెక్టులోకి వెళ్లనిచ్చేది లేదంటూ రైతులు హెచ్చరించారు. రైతుల ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద యురేనియం గనుల్లో ఒకటైన కడప జిల్లాలోని తుమ్మలపల్లి. దక్షిణ భారతదేశంలోని కేవలం ఈ ఒక్క ప్రాంతలోనే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఖనిజాన్ని వెలికితీస్తోంది. అయితే ఈ కారణంగా దీని సమీప గ్రామాల్లో మట్టి, నీరు కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్లు అధ్యయనంలో తేలింది. అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన పులివెందులలోని జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఈ అధ్యయనాన్ని చేపట్టింది.
ఈ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలైన తుమ్మలపల్లి, రాజకుంటపల్లి, భోమాయిహగిరిపల్లి, వి కోట, మబ్బుచింతపల్లి గ్రామాల్లోని నీరు, మట్టి నమూనాలను సేకరించి అందులోని నాణ్యతలను పరిశీలించారు. వీటిలో భార లోహాలైన బేరియం, కోబాల్ట్, క్రోమియం, కాపర్, మోల్బిడమ్, నికెల్, లెడ్, రుబిడియమ్, స్ట్రాన్షియం, వెనేడియం, యత్రియం, జింక్, జిర్కోనియమ్ భారీగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే నికెల్, స్ట్రాన్షియం, జింక్, జిర్కోనియమ్, రుబిడియం మాత్రమే సాధారణ స్థాయిలో ఉన్నాయని, మిగతా లోహాలు వాటి పరిమితిని మించి ఎక్కువస్థాయిలో ఉన్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించిన సరైన చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా పరిశోధకులు కోరుతున్నారు.