YSRCP: భగ్గుమన్న మాచర్ల: వైసీపీ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన..నారా లోకేష్ శిలాఫలకం ధ్వంసం..!
గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడికి నిరసనగా గుంటూరు జిల్లా మాచర్లలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రెండోరోజు కొనసాగుతున్నాయి. రామకృష్ణారెడ్డిపై దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ నాయకులు బుధవారం మాచర్లలో నిరసన ప్రదర్శనలను చేపట్టనున్నారు. అర్ధనగ్న ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పామర్రులోనూ ఇదే తరహా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గుంటూరు జిల్లా చినకాకాని వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఆయన కారును ధ్వంసం చేశారు. రామకృష్ణా రెడ్డి గన్ మెన్ పై చేయి చేసుకున్నారు. ఈ ఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే కృష్ణా జిల్లా పామర్రు శాసన సభ్యుడు కైలే అనిల్ కుమార్ యాదవ్ పైనా ఇదే తరహాలో దాడి చేశారు. ఈ రెండు సంఘటనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.
వైసీపీ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన..నారా లోకేష్ శిలాఫలకం ధ్వంసం..!#AndhraPradesh #YSRCP #TDP pic.twitter.com/bn8QGL1NBy
— Oneindia Telugu (@oneindiatelugu) January 8, 2020
జల వనరులశాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్, విప్ దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తదితరులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు సంధించారు. మరోవంక- పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మాచర్లలో ఆయన అనుచరులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలను చేపట్టారు.
మాచర్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు నిరసనగా నినాదాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి నారా లోకేష్ వేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం అర్ధనగ్న ప్రదర్శనను నిర్వహించారు. బుధవారం కూడా మాచర్ల పట్టణంలో నిరసన ప్రదర్శనలను చేపట్టాలని నియోజకవర్గ నాయకులు నిర్ణయించారు. పిన్నెల్లిపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.