పవన్ చెబితే వినడానికి మేమేమన్నా చిన్నపిల్లలమా?;టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలనం
టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు...గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడిన టిజి వెంకటేష్ మరోసారి పవన్ గురించి తనదైన శైలిలో మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఎంపీల రాజీనామాలు చేయాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి టిజి వెంకటేష్ ను ప్రశ్నించగా ఆయన పవన్ వ్యాఖ్యలను సీరియస్ గా పట్టించుకోవాల్సిన పని లేదన్నట్లుగా మాట్లాడారు.
Recommended Video
కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఎపికి అన్యాయం జరిగిన నేపథ్యంలో టిడిపి ఎంపి టిజి వెంకటేష్ తాజా పరిణామాలపై స్పందించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. బిజెపితో కటీఫా?... అనే విషయం దగ్గరు నుంచి పవన్ కళ్యాణ్ పాత కామెంట్ల వరకు అనేక విషయాలపై తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.
బిజెపితో కటీఫా?...పవన్ తో దోస్తీనా?..
భారతీయ జనతా పార్టీతో దోస్తీ వదులుకుని, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలుస్తారా? లేదా? అనే విషయంపై టిడిపి ఎంపి టిజి వెంకటేష్ ను ప్రశ్నించగా అది ఆయా పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఆ విషయమై తమ స్థాయిలో స్పందించే అంశం కాదని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు.
పవన్ చెబితే...చిన్నపిల్లలమా?...
కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యవహరిస్తున్నతీరుపై గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేయాలంటూ పిలుపునిచ్చారని, మరి బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అందరూ అంటున్నందున ఇప్పుడు రాజీనామా చేయనున్నారా? అన్న ప్రశ్నకు టీజీవీ సమాధానం ఇస్తూ, 'పవన్ చెబితే వినడానికి మేమేమన్నా చిన్నపిల్లలమా?' అని వెటకారం చేశారు. తద్వారా పవన్ కళ్యాణ్ కు తమకు చెప్పేంత స్థాయి లేదన్నట్లుగా తేల్చేశారు.
చంద్రబాబు పట్ల...బిజెపి వైఖరిపై...టిజివి స్పందన
చక్రం తిప్పడంలో సిద్ధహస్తుడు చంద్రబాబునే బిజెపి పట్టించుకోవడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా టిజి వెంకటేష్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబునే బిజెపి పట్టించుకోకుంటే ఇక తామెంత అన్నట్లుగా టిజి పరోక్షంగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించినట్లయింది.
బడ్జెట్ పై...అధినేత అసహనం...
కేంద్రం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారని, ఎల్లుండి సాయంత్రం చంద్రబాబు టీడీపీ నేతలతో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారు. అయితే మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు బడ్జెట్లో ఎపికి అన్యాయంపై వేచిచూసే ధోరణిలోనే ఉన్నట్లుగా అర్థం అవుతోంది. తాజాగా ఆయన ఈ విషయమై మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని, అయితే అది ఎలా అనేది రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు తమ పార్టీ నేతలతో చెప్పినట్లుగా తెలుస్తోంది.