టీటీడీకొచ్చే డబ్బులు రాయలసీమవే: వెనకుడుగు వేసేదే లేదు: టీజీ సంచలనం..!!
సంచలన వ్యాఖ్యలతో వార్తలో నిలిచే రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మరోసాకి అటువంటి వ్యాఖ్యలే చేసారు. రాయలసీమ హక్కుల కోసం నిరంతరం ప్రస్తావించే టీజీ ఈ సారి కొత్త డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాయలసీమలో ఉందని.. టీటీడీకొచ్చే డబ్బులన్నీ రాయలసీమ అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాయలసీమ హక్కుల గురించి తరచూ ప్రస్తావిస్తూ.. నీళ్లు..నిధులు..నియామకాల గురించి మాట్లాడే టీజీ ఇప్పుడు ఏకంగా టీటీడీ డబ్బులు రాయలసీమకే చెందుతాయంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
దీనికి కొనసాగింపుగా విజయవాడ దుర్గగుడి, సింహాచలం ఆలయాల డబ్బులు ఆ ప్రాంతానికే ఖర్చు పెడుతున్నారని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారిని టీటీడీ మెంబర్స్గా నియమిస్తున్నారని.. కానీ వారు మాత్రం రాయలసీమ అభివృద్ధిపై మాత్రం మనసు పెట్టడం లేదన్నారు. ఇక రాయలసీమ నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమన్నారు. గోదావరి నీళ్లు కృష్ణా ప్రాంతానికే ఇచ్చి.. రాయలసీమ నీళ్లు సీమకే వాడుకునేలా చేస్తామని గతంలో వైఎస్ చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇంత వరకూ ఆ జీవో అమలు కాలేదని ఆరోపించారు. దీని వల్ల భవిష్యత్లో అలజడులు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి జగన్ తానిచ్చిన హామీల అమలు కోసమే నిధులు ఖర్చు చేస్తున్నారంటూ టీజీ ఫైర్ అయ్యారు. గుండ్రేవుల, సిద్దేశ్వరం, అలుగు ప్రాజెక్టులు నిర్మిస్తే.. మా నీళ్లు మేమే వాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నారు. దీని వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ మేనిఫెస్టో వల్ల కొందరికే లాభం ఉంటుందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చే నిధులతో మాత్రం ప్రాజెక్టులకు స్పీడ్ బ్రేకర్లు లేకుండా పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అమరావతి ఫ్రీ జోన్, రాయలసీమకు నీళ్లు, నిధుల సాధన విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రాజ్యసభ సభ్యుడు టీజీ వేంకటేష్ స్పష్టం చేసారు. ఇప్పుడు టీజీ వ్యాఖ్యల మీద ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.