సమ్మర్ కేపిటల్: బాబుకు టిజి వెంకటేష్ షరతు! 'జగన్ ఎదురుచూపు'
చిత్తూరు: మాజీ మంత్రి టిజి వెంకటేష్ సోమవారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరికలు, షరతులు జారీ చేస్తూనే, మరోవైపు ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చురకలు అంటించారు.
ఆయన సోమవారం తిరుపతిలో మాట్లాడారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయని టిజి అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల కంటే సీమ, ఉత్తరాంధ్రలు ఎక్కువగా వెనుకబడి ఉన్నాయని చెప్పారు.
రాయలసీమ ప్రాంతంలో ఎండాకాలం రాజధాని (సమ్మర్ కేపిటల్) ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఎదుట డిమాండ్ పెట్టారు. అంతేకాకుండా, రాజధాని అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ప్రతిపక్షం కనుమరుగు కావడం ఖాయమని టిజి వెంకటేష్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్కు హక్కు లేదు: కెఈ కృష్ణమూర్తి
ప్రత్యేక హోదా పైన మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వేరుగా అన్నారు. ఎవరు ఎప్పుడు చనిపోతారా, వారి కుటుంబాలను ఎప్పుడు ఓదార్చుదామా అని జగన్ ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి రూ.6,600 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు.