పాక్ ప్రత్యేక దేశమేగా: హైద్రాబాద్పై టిజి, జగన్ పార్టీపైనా
హైదరాబాద్: ఓ వర్గం వారు అధికంగా ఉన్నారని పాకిస్తాన్ను ప్రత్యేక దేశంగా చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహా ఎందరో తెలంగాణేతరులు ఉన్న హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే తప్పేమిటని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు రాకముందే అసెంబ్లీని రద్దు చేయాలని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో మావాళ్లే గోతులు తవ్వారని టిజి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంతో పాటు అలంపూర్, కొల్లాపూర్, గద్వాల్లు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినవే అన్నారు. విభజన తర్వాత సమైక్య పార్టీ పెడితే లాభమేమిటని ప్రశ్నించారు.
సమైక్య ఉద్యమంలో కొంతమంది గూండాలు ఉన్నారని, అందులో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఒకటి అని ధ్వజమెత్తారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. తన వంతుగా తాను జనాన్ని పంపిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగాక సమైక్య పార్టీ పెట్టినా ఎలాంటి లాభం ఉండదని చెప్పారు.
శ్రీశైలం తెలంగాణది అవుతుందా?: ఏరాసు
రెవెన్యూ రికార్డుల ప్రకారం భద్రాచలం తెలంగాణది అయితే ఫారెస్ట్ రికార్డుల ప్రకారం శ్రీశైలం తెలంగాణది అవుతుందా అని మరో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. ఏదీ వీలుగా ఉంటే అది తమదని చెప్పడం సరికాదన్నారు. చర్చలంటూనే బిల్లు తెచ్చేందుకు సిద్ధపడుతున్న కేంద్రం చర్చలు ఎందుకు జరుపుతోందని ప్రశ్నించారు. విభజనపై మిగతా రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్ని అనుసరించాలన్నారు. అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు.