కేసీఆర్ కాళ్లు పట్టడమే తాగుబోతు పని: కేకేపై టీజీ తీవ్రవ్యాఖ్యలు, మోడీ నిజాయితీకు సెల్యూట్
కర్నూలు: తనపై తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎంపీ కే కేశవ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేత, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ శుక్రవారం మండిపడ్డారు. కేకేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మెదడు మోకాళ్లలో ఉందని, ఆయన తాగుబోతు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ నిజాయితీకి సెల్యూట్ అంటూ, పరిపాలన బాగా లేదన్నారు.
కేసీఆర్ కాళ్లు పట్టడమే తాగుబోతు పని: కేకేపై టీజీ తీవ్రవ్యాఖ్యలు
నేను మాట్లాడిన మాటలు చిల్లర మాటలు కాదని టీజీ వెంకటేష్ చెప్పారు. తెలంగాణ, ఏపీ సమస్యలపై టీఆర్ఎస్ నేతలు మాట్లాడాలన్నారు. చంద్రబాబు, కేసీఆర్లు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాట్లాడాలని సూచించానని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో కేకే ఎక్కడ?
తన గురించి మాట్లాడిన కే కేశవ రావు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. అసలు కేకేనే ఓ పిచ్చోడు అన్నారు. పిచ్చోడికి అందరు కూడా పిచ్చివాడిలాగే కనిపిస్తారని చెప్పారు. కేకేకు మెదడు మోకాళ్లలో ఉందన్నారు.
మాలో హాట్ బ్లడ్ ఉందన్నారు. కేకేలో రక్తం ఎక్కడ ఉందని చెప్పారు. మాలో సీమ రక్తం ఉంటే, కేకేలో సారాయి రక్తం ఉందన్నారు.
కేసీఆర్ కాళ్లు పట్టడమే తాగుబోతు కేకే పని
కేసీఆర్, చంద్రబాబు, నారా లోకేష్.. అందరూ కష్టపడుతున్నారని టీజీ చెప్పారు. సాయంత్రమైతే కేసీఆర్ కాళ్లు పట్టడం తప్ప కేకేకు పని ఏముందని మండిపడ్డారు. కేకేకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఇస్తే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కేసీఆర్, హరీష్ రావు లాంటి వారు కష్టపడుతున్నారని, తాగుబోతు కేకే ఏం చేస్తుననారని టీజీ వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మేము ఢిల్లీలో ఏపీ సమస్యలపై పోరాటం చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీని కేసీఆర్ కలిస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయని ప్రశ్నించారు. విభజన సమస్యలపై మేం పోరాడుతుంటే సంఘీభావం తెలపరా అన్నారు.
మోడీ నిజాయితీకి సెల్యూట్
ఏపీ, తెలంగాణలు కలిసి పోరాడకుంటే దెబ్బతింటామని టీజీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నిజాయితీకి సెల్యూట్ చేస్తామని, కానీ పరిపాలన సరిగా లేదన్నారు. అయితే విభజన కష్టాలు ప్రధానికి తెలియవా అన్నారు. ఇచ్చినవి అన్ని తీసుకుందామని చంద్రబాబు ఓపిక పట్టారన్నారు.
స్టీల్ ప్లాంటు పైన
స్టీల్ ప్లాంటుకు వయబులిటీ లేదనడం సరికాదన్నారు. కడపలో, బయ్యారంలో స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం మేం పోరాడుతుంటే టీఆర్ఎస్ నేతలు కూడా మాటలాడాలన్నారు. కృష్ణా జలాల కోసం ఇరువురు కలిసి పోరాడే అవసరం లేదా అని ప్రశ్నించారు. మీకు ప్రజలే బుద్ధే చెబుతారన్నారు.