సీమకు అన్యాయం! సెంటిమెంటుతో రెచ్చగొడతాం..: రాజధానిపై టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై రాయలసీమ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే రాయలసీమకు అన్యాయం జరిగిందన్న ఆయన.. ఇప్పుడు కూడా మరోసారి అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.
రాయలసీమకు ఇప్పటికే అన్యాయం..
గతంలో కర్నూలు రాజధానిగా ఉండగా దాన్ని తరలించారని.. ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు మూడు కూడా రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. లేదంటే రాయలసీమకు మరోసారి అన్యాయం జరుగుతుందన్నారు. మొదట మద్రాసు నుంచి తరిమేశారని.. అక్కడి నుంచి కర్నూలుకు రాజధాని వచ్చిందన్న టీజీవెంకటేష్.. ఆ తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. రాజధాని హైదరాబాద్ వెళ్లడంతో ఈ ప్రాంత ప్రజలు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టారని, ఆ తర్వాత అమరావతిలో రాజధాని పెట్టారని చెప్పుకొచ్చారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం..
అమరావతిని ఫ్రీ జోన్ చేయనప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. రాయలసీమ ప్రాంత వాసులు మద్రాసు, హైదరాబాద్ తదితర చోట్ల పెట్టుబడులు పెడుతున్నారని.. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే ఇక్కడే పెట్టుబడులు పెడతారని టీజీ వ్యాఖ్యానించారు. దీంతో రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీమలో సచివాలయం లేదా హైకోర్టు ఏర్పాటుచేయాల్సిందని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.
సీమలో సచివాలయం, అసెంబ్లీ కూడా..
ప్రస్తుత పరిస్థితుల్లో హైకోర్టుబెంచ్ తోపాటుమినీ సెక్రటేరియట్, అసెంబ్లీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ టీజీ తెలిపారు. కనీసం ఒక సీజన్ అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరగాలని అన్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ తిరగాలన్నారు. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
సెంటిమెంటుతో రెచ్చగొడతాం..
రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి నుంచి అనుమతులు అవసరమని ఎంపీ టీజీ అన్నారు. అది అంతతేలికైన వ్యవహారం కాదని అన్నారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలనేది రెచ్చగొట్టడం కాదని.. అది రాయలసీమ ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. అంతేగాక, దీని కోసం సెంటిమెంట్ ను తప్పనిసరిగా రెచ్చగొడతామని, ఆ తర్వాత ప్రజలే తేలుస్తారని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. సీమలో రాజధాని ఏర్పాటు చేయకుంటే ఈ ప్రాంత ప్రజలు మరోసారి నష్టపోతారని అన్నారు.