జీఎన్ రావు కమిటీ నివేదికతో సీమకు న్యాయం, 60 శాతం మందికి లబ్ధి: టీజీ వెంకటేశ్
ఏపీలో రాజధాని మార్పు అంశం హీటెక్కిస్తోంది. రాజధానుల ఏర్పాటుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అమరావతి ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీని వీడి బీజేపీలో చేరిన టీజీ వెంకటేశ్ మాత్రం స్వాగతించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జీఎన్ రావు కమిటీ నివేదికను బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ స్వాగతించారు. కమిటీ నివేదికలో రాయలసీమకు న్యాయం జరిగేలా రూపొందించారని పేర్కొన్నారు. సీమ దాదాపు 60 శాతం లబ్ది పొందుతుందని చెప్పారు. అమరావతి, కర్నూలులో మినీ సచివాలయాలు పెడితే బాగుంటుందని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో రాజధానుల ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాజధానుల గురించి కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారావు మీడియాకు తెలియజేశారు. అమరావతిలో అసెంబ్లీ, రాజ్భవన్, మంత్రుల నివాసా సముదాయాలు ఉంటాయని..విశాఖపట్టణంలో సమ్మర్ అసెంబ్లీ నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. వేసవిలో విశాఖపట్టణంలో అసెంబ్లీ నిర్వహించడానికి గల కారణం కూడా కమిటీ సభ్యుడు సుబ్బారావు వివరించారు. అమరావతిలో ఎండల వేడి ఉన్నందున వేసవి తాపం తట్టుకొనేందుకు విశాఖలో సమ్మర్ అసెంబ్లీ నిర్వహించాలని సూచించినట్టు పేర్కొన్నారు.