ఆ విషయంలో జగన్ కి ధన్యవాదాలు..! మరో సారి ట్వీటేసుకున్న లోకేష్..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో మాటల యుద్దం, అసెంబ్లీ బయట ట్విట్టర్ యుద్దం కొనసాగుతూనే ఉంది. ఏపిలో మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ ఈ యుద్దం ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష పార్టీపై అదికార పార్టీ ట్విట్టర్ వార్ ఇప్పట్లో చల్లారేలా లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్వీట్టర్ వేదికగా టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ మరోమారు విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని జగన్.. అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికలలో ఓటమి తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉన్న టీడీపీ జనరల్ సెక్రెటరీ మరియు మాజీ మంత్రి నారా లోకేష్..కొద్ది రోజుల తర్వాత ట్విట్టర్ వేదికగా..విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. 'జాబు రావాలి అంటే బాబు పోవాలి', 'బాబు హయాంలో ఒక్క జాబు కూడా రాలేదు' ఇలాంటి ఎన్నో అబద్దాలను పాదయాత్రలో చెప్పారు జగన్ గారు అని లోకేష్ అన్నారు.
ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుగారి హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేసి 5,13,351 మందికి ఉద్యోగాలు కల్పించారు అని చెప్పారు. ఐటీలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. ఇలానే ఎలెక్ట్రానిక్స్ ఇంకా ఇతర రంగాల్లో మేమిచ్చిన ఉద్యోగాలు, ఏర్పాటవుతున్న కంపెనీలు, రాబోయే ఉద్యోగాల వివరాలు కూడా బయటపెట్టి మీ పత్రిక అసత్యాల సాక్షి అని ప్రజలందరికీ తెలియజేయాలని జగన్ గారిని కోరుతున్నాను.ఏర్పాటవుతున్న కంపెనీల వివరాలు మీరెలాగూ బయట పెట్టరు. ఇవిగోండి! మీరు చెప్తున్న 5.60 లక్షల ఉద్యోగాలతో పాటు చంద్రబాబుగారి హయాంలో పనులు ప్రారంభించి, రాబోయే రోజుల్లో యువతకు అందించబోతున్న మరో 8 లక్షల పైచిలుకు ఉద్యోగాల వివరాలు. ఇవి కూడా మీ ఘనతగా చెప్పుకుంటారేమో! అని ఆయన మంది పడ్డారు.