ThankYouLokeshAnna : పరీక్షల రద్దు లోకేష్ విజయంగా టీడీపీ హైప్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ !!
ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలపై సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, సుప్రీంకోర్టు పేర్కొన్న టైం షెడ్యూల్లో పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం వీలు కాదని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం ఫైనల్ గా పరీక్షలను రద్దు చేస్తూ తమ నిర్ణయాన్ని వెల్లడించింది.పరీక్షల నిర్వహణ విషయంలో మొండిగా ప్రవర్తించిన ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసినట్లుగా చివరకు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇది టీడీపీ సాధించిన విజయంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
Recommended Video
పరీక్షల రద్దు కోసం రెండు నెలలుగా లోకేష్ పోరాటం : అచ్చెన్నాయుడు
మొదటి నుంచి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వానికి, గవర్నర్ కు లేఖలు రాస్తూ ఏపీ సర్కార్ పై పెద్దఎత్తున పోరాటం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దే పరీక్షలను రద్దు చేసిన క్రెడిట్ అని టిడిపి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్రంలో పరీక్షలను రద్దు చేయడం హర్షణీయమని పేర్కొనడంతో పాటు, ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు సాధించిన విజయమని తెలిపారు .
లోకేష్ అలుపెరుగని పోరాటం ఫలించింది : అచ్చెన్న
కోర్టు మొట్టికాయలు వేస్తే గాని కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రికి క్లారిటీ రాలేదా అంటూ ఎద్దేవా చేసిన అచ్చెన్నాయుడు, గత రెండు నెలలుగా టీడీపీ నేత నారా లోకేష్ విద్యార్థుల కోసం అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో, విద్యార్థులతో అనేకమార్లు మాట్లాడారని, ప్రభుత్వానికి అనేక లేఖలు రాశారని, చివరికి గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. లోకేష్ పోరాటం చివరకు ఫలించిందని పేర్కొన్నారు.
ఇది లోకేష్ సాధించిన విజయం : దేవతోటి నాగరాజు
ఇక టిడిపి నేత దేవతోటి నాగరాజు కూడా రాష్ట్రంలో టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు విద్యార్థులు, తల్లిదండ్రులు, లోకేష్ సాధించిన విజయమని పేర్కొన్నారు. ప్రతిపక్షం పోరాటం చేస్తే ఏ ప్రభుత్వం అయినా దిగిరాక తప్పదని, కేవలం ప్రతిపక్షం పై పైచేయి సాధించడం కోసమే మొండిగా ముందుకు వెళ్లకూడదని అభిప్రాయపడ్డారు. దూరదృష్టితో లోకేష్ పరీక్షలు రద్దు కోసం ఎంతగానో పోరాటం చేశారని, దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు లోకేష్ పట్ల అభిమానం పెరిగిందని దేవతోటి నాగరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.
విద్యార్థుల వైపు నిలబడి పోరాటం చేసిన ఒకే ఒక్కడు : నిమ్మకాయల చినరాజప్ప
మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప , మూర్ఖపు ఏపీ ప్రభుత్వంపై విద్యార్థుల వైపు నిలబడి పోరాటం చేసిన ఒకే ఒక నాయకుడు లోకేష్ అంటూ, అందుకే స్టూడెంట్స్ అందరూ థాంక్యూ లోకేష్ అన్న అంటున్నారని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియాలోనూ పరీక్షలు రద్దు నేపథ్యంలో విద్యార్థుల కోసం అతనొక్కడే ఆలోచించాడు, పోరాడాడు, సాధించాడు అంటూ థాంక్యూ లోకేష్ అన్న అంటూ పెద్ద ఎత్తున పోస్ట్ లు ట్రెండ్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలోనూ లోకేష్ కు విపరీతమైన హైప్
16.30 లక్షల మంది విద్యార్థులు తరఫున పోరాడతానని మాటిచ్చాడు నిలబెట్టుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. న్యాయం గెలిచింది , నారా లోకేష్ పోరాటం ఫలించింది అంటూ టిడిపి అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాల పోరాటాలకు విద్యార్థులు తోడైతే ఎంతటి మూర్ఖుడైన దిగి రావాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. చెప్పాడంటే చేస్తాడంతే అంటూ నారా లోకేష్ కు కితాబిస్తున్నారు.
పరీక్షల రద్దుకు మొదటి నుండి డిమాండ్ చేసిన లోకేష్ , సుప్రీం ఒత్తిడితో ఏపీ సర్కార్ నిర్ణయం
మొదటి నుంచి లోకేష్ పరీక్షలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం లోకేష్ పట్టుబట్టడంతోనే మొండిగా వ్యవహరించింది. ఇది ఏపీ రాజకీయాలను దగ్గరుండి చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అయితే ఊహించని విధంగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో సీరియస్ అవడంతో, సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఏపీ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో, ఇదే సమయంలో ఎవరికైనా ప్రాణ హాని జరిగితే కోటి రూపాయల పరిహారం చెల్లించాలని సుప్రీం వార్నింగ్ ఇవ్వడంతో ఏపీ సర్కార్ సందిగ్ధంలో పడింది.
టీడీపీ నేత లోకేష్ విక్టరీగా అభివర్ణిస్తూ ప్రచారం.. వైసీపీ నేతలకు కౌంటర్ గా
వెంటనే పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం ఒత్తిడి తీసుకురావడంతో ఫైనల్ గా ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. సుప్రీం ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నా, మొదటి నుండి పరీక్షలు రద్దు చెయ్యాలని లోకేష్ పోరాటం చేస్తున్న నేపధ్యంలో అయితే ఇది టిడిపి విక్టరీ గా, ముఖ్యంగా నారా లోకేష్ సాధించిన విజయంగా అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
వైసీపీ నేతలు లోకేష్ ను పప్పు, చవట, దద్దమ్మ , మాలోకం అంటూ అసమర్దుడిగా చిత్రీకరిస్తున్న సమయంలో లోకేష్ సమర్ధుడు అని దీని ద్వారా టీడీపీ ప్రచారం చేస్తుంది.