ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతం, కానీ, మంత్రి పదవులు తప్పే: బిజెపి
హైదరాబాద్: వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించడంపై తాను చేసిన వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడకూడదని బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని విష్ణుకుమార్ అభిప్రాయపడ్డారు.
పార్టీ మారి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కేటాయించడంపై వారం రోజుల క్రితం బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవుల్లో కొనసాగుతున్న వారు రాజీనామాలు చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.
పీఎసీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విష్ణుకుమార్ రాజు పీఏసీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పక్కన ఉండగా ఈ వ్యాఖ్యలు చేయడంపై టిడిపి నేతలు తప్పుపడుతున్నారు.
ఆ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడొద్దు
పార్టీ ఫిరాయించి వైసీపీ నుండి టిడిపిలో చేరిన వారికి మంత్రి పదవులు కేటాయించడంపై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమైనవని బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడకూడదని విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బిజెపి నేతలు మిత్ర ధర్మాన్ని పాటించడం లేదంటూ చేసిన వ్యాఖ్యల మరునాడే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
రాజకీయాలకు అతీతంగా మాట్లాడాను
పీఏసీ సభ్యుడిగా తాను రాజకీయాలకు అతీతంగానే వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం తప్పేనని మరోసారి విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.పీఏసీ సభ్యుడిగానే తాను నిష్పక్షపాతంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు విష్ణుకుమార్ రాజు చెప్పారు.
సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తాం
రాష్ట్రంలో తమ పార్టీ సంకీర్ణ ధర్మాన్ని పాటించనున్నట్టు బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బిజెపి నేతలుసంకీర్ణ ధర్మాన్ని విస్మరిస్తున్నారని విమర్శలు చేశారు. బిజెపి నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే తమపై విమర్శలు చేస్తున్నారని ప్రకటించిన మరునాడే విష్ణుకుమార్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. సంకీర్థధర్మాన్ని పాటిస్తామని ఆయన ప్రకటించారు.
పొత్తులపై బిజెపి నాయకత్వం చూస్తోంది
పొత్తులపై మాట్లాడే స్థాయి తనది కాదని బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. 2019 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం చూసుకొంటుందని విష్ణుకుమార్ రాజు కుండబద్దలు కొట్టారు.