'ఆ క్రెడిట్ వైఎస్ దే.. బాబు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలి'
విజయవాడ : ఒలింపిక్స్ లో సింధు పతకం సాధించడానికి తానే కారణమంటూ చెప్పుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. విషయమేదైనా క్రెడిట్ మొత్తం తనదే అన్న తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై అటు సోషల్ మీడియాలోను, ఇటు రాజకీయంగాను ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా దీనిపై స్పందించిన మాజీ ఎంపీ హర్షకుమార్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింధు విజయాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలని చూడడం ఆశ్చర్యానికి గురిచేసేదిగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో మైక్రోసాఫ్ట్ సీఈవో గా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో గా సుందర్ పిచాయ్ ఎంపికైనప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించారని గుర్తు చేశారు హర్షకుమార్.
చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వస్తోన్న స్పందన చూసైనా చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలని హర్షకుమార్ సూచించారు. ఇక గోపిచంద్ అకాడమీ గురించి ప్రస్తావించిన హర్షకుమార్.. అకాడమీ అభివృద్ధి అంతా తనవల్లే జరిగిందని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు వ్యవహరమని విమర్శించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అకాడమీ అభివృద్ధికి బాటలు పడ్డాయని చెప్పారు హర్షకుమార్.
ఇదే విషయాన్ని మరింత నొక్కి చెబుతూ.. అకాడమీ అభివృద్ధి ఫీజు రూ.1.2 కోట్లను రద్దు చేసింది వైఎస్ హయాంలో కాదా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. ఇక తాజా పుష్కరాల విషయంపై స్పందిస్తూ.. పాలనా విషయాలను పక్కనబెట్టి చంద్రబాబు పుష్కరాల పేరుతో సమయం వృధా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వ్యవహారమంతా ఓ ఈవెంట్ మేనేజర్ ను తలపించేలా ఉందని.. కడియం పూలు, ఆస్ట్రేలియా టపాసులు అంటూ ఓ సీఎంగా కాకుండా ఈవెంట్ మేనేజర్ లా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టాలో అన్న విషయాన్ని పక్కనబెట్టి పుష్కరాల పేరుతో కాలక్షేపం చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని ఈ సందర్బంగా హర్షకుమార్ బాబుపై విరుచుకుపడ్డారు.