వాజ్ పేయి ఎదురొచ్చేవారు...అద్వానీ వడ్డించేవారు....ఆ రోజుల్లో అదీ నా హవా అంటున్న చంద్రబాబు
అమరావతి: అసలు రాజకీయాలే చిత్రమైనవి...అందులో ఎపి రాజకీయాలు మరీ విచిత్రమైనవి.ఈ మాట ఎందుకనాల్సి వచ్చిందంటే బిజెపిని అధికార పీఠంపై ఆసీనం గావించిన భారత రాజకీయ దిగ్గజం అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినం డిసెంబర్ 25. అయితే ఎపిలో ఆయన పుట్టినరోజు సందర్భంగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు రాజకీయ వైచిత్రిని కళ్లకు కట్టాయి...అవేంటంటే...
భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్ పేయి వేడుకలకు మన ఎపి బిజెపి నేతలు ఇచ్చిన ప్రాధాన్యం చూశారా? అంతగా చూడటానికి అవి అంతలా జరిగితే కదా అనుకుంటున్నారా? మరి పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణాలో కూడా ఈ వేడుకలు బాగానే నిర్వహించారే...అదే చిత్రం...అయితే మరో విచిత్రం ఏమిటంటే వాజ్ పేయి పుట్టినరోజును ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా సెలబ్రేట్ చేశారు.
ఈ సందర్భంగా ఆ మహానేతకు కేవలం శుభాకాంక్షలు చెప్పడంతో సరిపుచ్చుకోకుండా వాజ్ పేయితో తనకున్నసాన్నిహిత్యంతో పాటు మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఒక సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ లో చంద్రబాబు వివరించారు. పనిలో పనిగా అద్వానీ గురించి కూడా చెప్పేశారు. అలాగే అప్పుడు ఎన్డిఎ ప్రభుత్వంలో తన హవా గురించి కూడా చెప్పారు. ఇప్పుడదే హాట్ టాపిక్ అయింది. ఎందుకు చంద్రబాబు అంత విడమర్చి ఆనాటి విషయాల్ని చెప్పారా అని...
చంద్రబాబు ఏం చెప్పారంటే...
వాజ్ పేయి పుట్టినరోజు సందర్భంగా ఆ రాజకీయ దిగ్గజానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఆ తరువాత ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ రివైండ్ చేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వాజ్ పేయి ప్రధానిగా ఉండగానే తనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో సవివరంగా చెప్పారు. అంతేకాదు అద్వానీ గురించి కూడా చెప్పారు. అలాగే ఎన్డీఎ విజయాలను, తన ప్రమేయంతో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించడంతో పాటు అప్పుడు ఎన్డిఎ ప్రభుత్వంలో తన హవా ఎంత జోరుగా సాగేదో విడమర్చి మరీ వివరించారు. అయితే ఇప్పుడదే హాట్ టాపిక్ అయింది. ఎందుకు చంద్రబాబు అంత వివరంగా ఆనాటి విషయాల్నిఅందరికి గుర్తుచేశారా అని...
ఆ రోజుల్లో ఎన్డీఏ లో...
ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబే కింగ్ మేకర్...ఆ కూటమిలో ఎక్కువ సీట్లు చంద్రబాబువే. అయినా ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. కాబట్టే పరిస్థితులకు అనుగుణంగా ఎపీకి ప్రయోజనాలను చేకూర్చే పనులు పూర్తిచేయించుకునేవారు. మరోవైపు భాగస్వామ్య పార్టీల్లో విభేధాలు వచ్చినా , ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా , కేంద్రం ఏదైనా ప్రతిష్టాత్మక పథకం ప్రవేశపెడుతున్నా, రాజకీయంగా ఏదైనా సవాల్ ఎదురైనా చంద్రబాబుతో భేటీలు తప్పనిసరి. సరిగ్గా ఆ విషయాలనే ఇప్పుడు వాజ్ పేయి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
ఎదురొచ్చేవారు...వడ్డించేవారు...
ఆ రోజుల్లో చాలా సందర్భాల్లో అద్వానీ, వాజ్ పేయిలే చంద్రబాబు విషయంలో చాలా పట్టువిడుపు ధోరణితో వ్యవహరించేవారట. దేశ రాజకీయ చరిత్రలో సమున్నత శిఖరం వంటి వాజ్ పేయి అనేక సార్లు చంద్రబాబుకు ఎదురొచ్చి తీసుకువెళ్లడం, ఎన్డిఏ సమావేశాలకు వెంటబెట్టుకొని వెళ్లడం చేసేవారట. ఆ దృశ్యాలను ఉత్తరాది నేతలు ఆశ్చర్యంగా...అసూయగా చూసేవారట...ఇక అద్వానీ అయితే విందు సమావేశాల్లో స్వయంగా చంద్రబాబుకు వడ్డించేవారట. ఆ విషయాన్ని నేషనల్ మీడియాలో పనిచేసిన జర్నలిస్టులు తనతో ప్రత్యేకంగా ప్రస్తావించేవారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
ఇప్పుడు ఎందుకంటే...
అయితే వాజ్ పేయి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి సరిపుచ్చకుండా ఇప్పుడు చంద్రబాబు ఇదంతా ఎందుకు గుర్తు చేసుకున్నారనే అంశం చర్చనీయాంశం గా మారింది. అంటే ఇటీవలికాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఎ ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్న తమ పట్ల ప్రస్తుతం బిజెపి అగ్రనేతలు వ్యవహరిస్తున్న తీరుతో కలత చెంది ఆనాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారా? లేక ఆరోజుల్లో మీకంటే మహామహులే నాకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు మీరు తెలుసుకొని ప్రవర్తించడని ఇటు ఎపి అటు సెంటర్ లోని బిజెపి నేతలను హెచ్చరించడం కోసమా అంటే ఆ రెండోదో కరెక్టయి ఉండొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.