జగన్-చంద్రబాబు మధ్య తేడా అదే.. అమ్మ ఒడి వేదికపై ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు
Recommended Video
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 'అమ్మ ఒడి' పథకం విప్లవాత్మకమైనదని ఏఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అభిప్రాయపడ్డారు. పేదింటి బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపాలన్న ఆకాంక్షతోనే జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. భవిష్యత్ తరాల పిల్లలు అ అంటే అమ్మ ఒడి,ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని నేర్చుకుంటారని చెప్పారు.
అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్,మాజీ సీఎం చంద్రబాబుల మధ్య చాలా తేడా ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. గురువారం చిత్తూరు జిల్లాలో జరిగిన అమ్మఒడి పథకం ప్రారంభోత్సవ సభలో రోజా మాట్లాడారు.
జగన్-చంద్రబాబుల మధ్య తేడా అదే : రోజా
పేద పిల్లల కోసం అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన చరిత్రకారుడు వైఎస్ జగన్ అయితే.. ప్రభుత్వ పాఠశాలల్లో పేదల చదువును కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు బలిచేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని రోజా విమర్శించారు. అంతేకాదు, మధ్యాహ్నం భోజనం కింద పౌష్టికాహారంతో కూడిన మెనూని రూపొందించిన చరిత్రకారుడు జగన్ అయితే.. ఆ పేదలు తినే కోడిగుడ్లను మింగేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని విమర్శించారు.
జగన్ చరిత్రకారుడు- చంద్రబాబు చరిత్రహీనుడు : రోజా
నాడు-నేడు కార్యక్రమం ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల తరహాలో ఆధునీకరించిన చరిత్రకారుడు జగన్ అయితే.. కనీసం తను చదివిన పాఠశాలను కూడా అభివృద్ధి చేయలేని, చేతకాని చరిత్రహీనుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే రోజా ఘాటుగా విమర్శించారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన చరిత్రకారుడు జగన్ అయితే.. ఫీజు రీయింబర్స్మెంట్ను రూ.35 వేలకు కుదించిన చరిత్రహీనుడు చంద్రబాబు అన్నారు.
చదువే నిజమైన ఆస్తి :
గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్ కుమార్రెడ్డి చిత్తూరు జిల్లాకు చేసింది ఏమీ లేదని రోజా మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నుంచే వచ్చిన ఈ నేతలు సొంత జిల్లాకు ఏమీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పేద పిల్లల చదువుకోసం తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్ చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించడంపై ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతీ బిడ్డ చదువుకుంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని.. అదే మనం వారికి ఇచ్చే నిజమైన ఆస్తి అని చెప్పారు.
అమ్మ ఒడి పథకం వివరాలు :
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులు,80లక్షల పైచిలుకు విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ పాఠశాలలు,కాలేజీల్లో చదువుతున్న ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.15వేలు ప్రభుత్వం జమచేయనుంది. ప్రభుత్వం జమ చేసే ఆ మొత్తాన్ని.. పెండింగ్ బకాయిల కింద బ్యాంకులు జప్తు చేసుకునే అవకాశం లేకుండా బ్యాంకింగ్ అధికారులతో ఒప్పందం కూడా జరిగింది. ఈ పథకం ద్వారా స్కూల్ డ్రాపౌట్స్ తగ్గిపోయి పేద పిల్లలందరు బడి బాట పడుతారని ప్రభుత్వం భావిస్తోంది.