కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి బాబు వెళ్ళనిది అందుకే .. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ
టీడీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శల వర్షం కురిపించారు .తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించటంతో కేజ్రీవాల్ మరో మారు సీఎం అవుతున్నారని, అయినా ఏ రాష్ట్రంలో సీఎంల ప్రమాణ స్వీకారం అయినా తగుదునమ్మా అంటూ వెళ్ళే చంద్రబాబు కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం లేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకు కారణాలు సైతం చెప్పిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా బాబును , బాబు భజన సంఘాన్ని తిట్టిపోశారు .
బీజేపీ ఎంపీని వెనకేసుకొచ్చిన వైసీపీ ఎంపీ: టీడీపీ చెప్పింది నిజమైందా?
బీజేపీ భయంతోనే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళనిది
ఇక ఆయన చేసిన ట్వీట్ లో ఎంపీ విజయ సాయి రెడ్డి ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్నా చంద్రబాబు తన నమ్మకస్తులను పంపి ఆహ్వానం సంపాదించేవారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏలో లేపోయినా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే దమ్ము ఆయనకు లేదని పేర్కొన్నారు . ఎందుకంటె బీజేపీ పెద్దల కంట్లో పడితే పాత కేసులు ఎక్కడ తిరగతోడుతారో అని బాబు వణుకుతున్నారని విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . అప్పట్లో చంద్రబాబు తెగ చక్రం తిప్పారని , అప్పట్లో గిరగిరా తిప్పిన చక్రాలు ఏమయ్యాయో అని ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడారు .
రాష్ట్ర సమస్యలపై చర్చిస్తే మోడీ అక్షింతలు వేశారా ? అని మండిపాటు
అలాగే మీడియాలో కూడా చంద్రబాబు అనుకూల మీడియా ఉందని, దాన్ని భజన సంఘం అంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి . చంద్రబాబు అనుకూల మీడియాను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి బాబు సీఎంగా లేకపోవడంతో కిరసనాయిలు ఆంధ్రప్రదేశ్ నాశనం కావాలని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గంటన్నరసేపు సమావేశమై రాష్ట్ర సమస్యలపై చర్చిస్తే , అది కాకుండా పీపీఏలపై మోదీ మందలించాడని తప్పుడు వార్తలు రాశారని ఆయన చంద్రబాబు అనుకూల మీడియా అంటూ నిప్పులు చెరిగారు .
మా కోడి కూస్తేనే తెల్లారుతుందనుకుంటే ఎలా అని ప్రశ్నించిన వైసీపీ ఎంపీ
చంద్రన్న భజన పరాకాష్టకు చేరిందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు . చంద్రబాబు, ఆయన బానిస మీడియా ఇంతగా కుళ్లుకుంటున్నారంటే తిన్నది ఒంటబట్టడం లేదని విజయసాయి విమర్శలు గుప్పించారు . చంద్రబాబు కంటి నిండా నిద్ర పోవడం లేదని తెలిసిపోతోందని ఆయన పేర్కొన్నారు . దోపిడీ రోజులు పోయాయన్నారు . నిజాయితీ, విశ్వసనీయతల విలువేమిటో ప్రజలు గ్రహించారని పేర్కొన్న విజయసాయి పచ్చ తెరల లోకం నుంచి బయటకు రండి అంటూ వ్యాఖ్యానించారు . మా కోడి కూస్తేనే తెల్లారుతుందనుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు.