అందుకే అప్పుడు ప్రధాని పదవి వదులుకున్నా: చంద్రబాబు
అమరావతి: తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని, 40 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ సభ్యతగానే వ్యవహరించానని, ఎదుటివారిని గౌరవంగా సంబోధించానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.
తాను ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను ఏకవచనంతో సంబోధిస్తూ, వెటకారంగా మాట్లాడారని చంద్రబాబు గుర్తు చేశారు. దివంగత సీఎం రాజశేఖర్రెడ్డితో రాజకీయ విభేదాలే తప్ప, వ్యక్తిగత విభేదాలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా...
యూనైటెడ్ ఫ్రంట్కు కన్వీనర్గా ఉన్నప్పుడు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా ఎందుకు వదులుకున్నారు అన్న ప్రశ్నకు చంద్రబాబు నాయుడు సమాధానమిచ్చారు. ‘ప్రధాని అభ్యర్థి విషయంలో జ్యోతిబసు, కరుణానిధి, ములాయం, లాలూ, సూర్జిత్, బర్దన్, బీజూ పట్నాయక్లతో ఏపీ భవన్లో మాట్లాడాను. అందరికీ అరగంట చొప్పున టైం ఇచ్చి అందరితోనూ మాట్లాడి, ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించాం..' అంటూ ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
నా మీద వాళ్లకు అంత నమ్మకం...
ప్రధాని అభ్యర్థి ఎంపిక విషయం తన నెత్తిన పెట్టారని, అదే విషయాన్ని తాను అందరినీ అడిగానని చంద్రబాబు తెలిపారు. ‘ఎందుకండీ.. ఇదంతా నా నెత్తిన పెట్టకండి.. ఒక్కరు కాకుండా అభ్యర్థి ఎంపిక విషయంలో ఇద్దరు ముగ్గురు ఉందాం..' అని నేను అంటే.. ‘కాదు నువ్వు ఒక్కడే ఉండు. నువ్వు ఏం చెబితే అది వింటాం...' అని వాళ్లంతా నా మీద భరోసా ఉంచారు. నా మీద అంత నమ్మకాన్ని చూపారు..' అని చంద్రబాబు పేర్కొన్నారు.
నేనెందుకు వద్దనుకున్నానంటే...
ఆ టైంలో నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండమన్నారు. కానీ నేనేం అనుకున్నానంటే.. ‘నాది ఒక చిన్న పార్టీ. ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీ. ప్రధానమంత్రి పదవికి పోటీపడాలన్నా మన బలం ఒక్కటే సరిపోదు. అందరిపైనా ఆధారపడాలి. ఒకవేళ అయ్యానే అనుకోండి.. ఐదేళ్లే కదా? ఆ తరువాత నేనేం చేయాలి? మాజీ ప్రధానిగా రాష్ట్రానికి వచ్చి మళ్లీ సీఎం అవ్వలేను కదా. అందుకే.. ఎందుకు మనం అక్కడికెళ్లి.. చేయలేని పనిని నెత్తిన పెట్టుకుని లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం అని ఆలోచించా. అయినా ఇక్కడ నా రాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం అక్కడ ఉండదు కదా అనిపించింది...' అని చంద్రబాబు చెప్పారు.
భవిష్యత్తులో అవకాశం వస్తే...
ఒకవేళ భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు చంద్రబాబు వద్ద సమాధానం రెడీగానే ఉంది. ‘అలాంటి అవకాశం రాదనుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా నాకంత అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తయారు చేయాలి. అదే నా కమిట్మెంట్. చివరి శ్వాస వరకూ అందుకోసమే పనిచేస్తా..' అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.