ఆ వారెంట్ ఇచ్చింది చంద్రబాబుకు కాదు...తెలుగు ప్రజలకు;అవి చెల్లవు: అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం:తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురికాకూడదనే ఉద్దేశంతో ఎనిమిదేళ్ల కిందట బాబ్లీ ప్రాజెక్ట్కు సంబంధించి చంద్రబాబు పోరాటం చేశారని, అయితే ఆ కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేడు అరెస్టు వారెంట్లు ఇవ్వడం మోడీ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
బాబ్లీ ప్రాజెక్టు విషయమై ఎనిమిదేళ్ల తరువాత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వారెంట్ సీఎంకు కాదని, తెలుగు ప్రజలకు ఇచ్చినట్లయిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా దుప్పలపాడులో శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ ఓర్వలేనితనంతోనే ఈ పన్నాగం పన్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్ట,నష్టాల్లో ఉన్నా సునాయాసంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి ప్రధాని మోడీ ఓర్వలేకపోతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈనెల 23 న ఐక్య రాజ్యసమితిలో ప్రసంగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రైతుల ప్రయోజనాలపై ఆ యన ప్రసంగించనున్నారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
అయితే ఆయనను ఐక్య రాజ్యసమితికి వెళ్లకుండా అడ్డుకునేందుకే మోడీ ఈ అరెస్ట్ వారెంట్ పన్నాగం పన్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. అయితే అనుభవశాలి, చిత్తశుద్ది కలిగిన రాజకీయ నేత అయిన సిఎం చంద్రబాబు ముందు ప్రధాని మోడీ కుయుక్తులు చెల్లవని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సిఎం చంద్రబాబు 60 ఏళ్లుగా ప్రజలు ఎదురుచూసే పోలవరం 2019లో ప్రారంభం కానుందని, గ్యాలరీ వాక్లో తామందరం పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బాబ్లీ ప్రాజెక్ట్ కేసుకి సంబంధించి అందిన నోటీసులపై రాజ్యాంగపరంగా ముందుకువెళ్లనున్నట్లు మంత్రి కిమిడి కళా వెంకటరావు స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం...ప్రయోజనాల కోసం ఆనాడు చంద్రబాబునాయుడు బాబ్లి ప్రాజెక్ట్ వద్ద పోరాడారని కొనియాడారు.
అయితే ఎనిమిదేళ్ల తరువాత ఇప్పుడు నోటీసులు ఇవ్వడం, దీని వెనుక ఎవరి పాత్ర ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి కళా వెంకట్రావు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన జీవితం ప్రజల కోసం అంకితం చేశారని ఆయన ప్రస్తుతించారు.